అక్షరటుడే, వెబ్డెస్క్ :MLC Kavitha | తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ ఆధ్వర్యంలో జూలై 17న రైల్ రోకో కార్యక్రమాన్ని తలపెట్టిన విషయం తెలిసిందే. కాగా.. సింగరేణి జాగృతి(Singareni Jagruti) రూపొందించిన రైల్ రోకో పోస్టర్లను కవిత తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు సమయంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేస్తూ చీకటి ఆర్డినెన్స్ ఇచ్చిందన్నారు. ఈ ఆర్డినెన్స్ వల్లనే భద్రాచలం పట్టణానికి ఆనుకుని ఉన్న ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తమపట్నం, గుండాల గ్రామాలు ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh)లో వీలీనం అయ్యాయని పేర్కొన్నారు. వాటిని తిరిగి తెలంగాణ రాష్ట్రంలోకి విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందని.. ఇందుకు జాగృతి చేసిన పోరాటమే కారణమన్నారు.
MLC Kavitha | ఇది మా విజయం..
ఈ నిర్ణయం తెలంగాణ జాగృతి(Telangana Jagruti) చేపట్టిన ఉద్యమానికి, ఐదు గ్రామాల ప్రజల దీర్ఘకాలిక పోరాటానికి విజయఘట్టంగా కవిత చెప్పుకొచ్చారు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన సమయంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న చీకటి ఆర్డినెన్స్ కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ఏపీకి వెళ్లిపోయాయి. అందులో భాగంగా భద్రాచలానికి ఆనుకుని ఉన్న ఐదు గ్రామాలు కూడా ఆంధ్రప్రదేశ్లో కలిసిపోయాయి. ఈ పరిణామం వల్ల భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి(Sri Seetharamachandra Swamy Temple) చెందిన భూములు, ప్రాచీన స్థలాలు ఏపీలోకి వెళ్లిపోయాయి. ఈ గ్రామాల ప్రజలు విద్య, వైద్యం, రవాణా వంటి మౌలిక వసతుల కోసం భద్రాచలం మీదే ఆధారపడి ఉండగా, పరిపాలనా పరంగా ఏపీకి చెందడంతో నిత్యం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు’ అని పేర్కొన్నారు.
‘తమ ఊరిలోని సమస్యకు పరిష్కారం కోసం వారికి మరో రాష్ట్రంలోని అధికారుల వద్దకు తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ నెల 20న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ‘పోలవరం – తెలంగాణపై జలఖడ్గం’ పేరుతో హైదరాబాద్లో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించినట్లు’ కవిత తెలిపారు. ఈ సందర్భంగా ఐదు గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను హైలైట్ చేస్తూ, కేంద్ర ప్రభుత్వం(Central Government)పై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారన్నారు. ఈ డిమాండ్కు స్పందనగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah)కు లేఖ రాసి, ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని విజ్ఞప్తి చేసిందని వ్యాఖ్యానించారు. ‘తెలంగాణ జాగృతి డిమాండ్ కు దిగివచ్చి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు గ్రామాల విలీనం అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఇప్పటికైనా స్పందించడం మంచి పరిణామం’ అని పేర్కొన్నారు. ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేసే వరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం’ అంటూ కవిత ‘ఎక్స్’లో పోస్టు చేశారు.