అక్షరటుడే, వెబ్డెస్క్: TET Exams | తెలంగాణలో టెట్ పరీక్షలు (TS TET Exams) బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 18 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. 9 రోజుల పాటు 16 సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. 15 జిల్లాల్లో 66 కేంద్రాల ఏర్పాటు చేశారు.
TET Exams | రెండు సెషన్లలో పరీక్షలు
రెండు సెషన్లలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. టెట్ పరీక్ష పేపర్–1, పేపర్–2 విధానంలో నిర్వహిస్తారు. పేపర్ –1 ఎస్జీటీ అభ్యర్థుల కోసం, పేపర్–2 స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఉంటుంది. జూన్ 18, 19 తేదీల్లో పేపర్–2 మ్యాథ్స్(Maths), సైన్స్ ఎగ్జామ్స్(Science Exams) నిర్వహిస్తారు. జూన్ 20 నుంచి 23 వరకు పేపర్–1 పరీక్షలు ఉంటాయి. జూన్ 24న పేపర్–2తో పాటు పేపర్–1 పరీక్ష జరుగుతుంది. జూన్ 27న పేపర్–1 పరీక్ష, జూన్ 28 నుంచి 30 వరకు పేపర్–2 (సోషల్ స్టడీస్) పరీక్షలు నిర్వహించనున్నారు.
TET Exams | 1,83,653 మంది దరఖాస్తు
ఈ సారి టెట్ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,83,653 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్-1 కోసం 63,261 మంది, పేపర్-2కు 1,20,392 మంది అప్లయ్ చేశారు. టెట్ ఫలితాలను(TET results) జూలై 22న విడుదల చేయనున్నారు. టెట్ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో జరుగుతుంది.