అక్షరటుడే, వెబ్డెస్క్:Ahmadabad Plane Crash | అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం(Air India plane) గురువారం మధ్యాహ్నం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది మృతి చెందారు. ఒక ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఈ ప్రమాదం నుంచి ఓ యువతి కొద్ది నిమిషాల ఆలస్యంతో తప్పించుకుంది.
గుజరాత్లోని భరూచ్ ప్రాంతానికి చెందిన భూమి చౌహాన్ నిన్న ఎయిర్ ఇండియా విమానంలో లండన్(London) వెళ్లాల్సి ఉంది. విమానం బయలు దేరాల్సిన సమయం 1:10 గంటలకు ఉంది. భూమి 12:20 నిమిషాలకు ఎయిర్పోర్ట్కు చేరుకుంది. అయితే ఎయిర్పోర్టు అధికారులు 12:10 గంటలకే చెక్ ఇన్ మూసి వేశారు. గంట ముందుగానే ప్రయాణికులను అనుమతిస్తారు. ఆ తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రయాణికులను విమానంలోకి అనుమతించారు. ఈ క్రమంలో ఆలస్యం అయినందుకు భూమి చౌహాన్ను అధికారులు అనుమతించలేదు. అమె అధికారులను బతిమిలాడినా రూల్స్ ఒప్పుకోవు అని చెప్పారు. దీంతో చేసేదేమీ లేక ఆమె వెను తిరిగారు. అయితే విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కూలిపోయిందనే విషయం తెలియడంతో ఆమె షాక్కు గురయ్యారు.
Ahmadabad Plane Crash | ఆ దేవుడే కాపాడాడు..
ప్రమాద ఘటన గురించి తలుచుకుంటూ ఇంకా శరీరం వణుకుతోందని భూమి చౌహన్ అన్నారు. విమాన ప్రమాదం నుంచి తనను దేవుడే రక్షించాడని ఆమె పేర్కొన్నారు. ట్రాఫిక్లో చిక్కుకోవడంతో తాము పది నిమిషాలు ఆలస్యంగా ఎయిర్పోర్టు(Airport)కు వెళ్లినట్లు ఆమె తెలిపారు. ప్రమాద విషయం తెలియగానే షాక్కు గురైనట్లు ఆమె తెలిపారు. ‘‘నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఆ దేవుడికి ధన్యవాదాలు. ఆ గణపతి బప్పే నన్ను కాపాడాడు’’ అని భూమి అన్నారు. కాగా.. లండన్లో భర్తతో కలిసి ఉంటున్న భూమి చౌహాన్ రెండేళ్ల అనంతరం వెకేషన్ కోసం ఇండియా వచ్చింది. తిరిగి వెళ్లాలనుకునే సమయంలో ఆలస్యంతో విమానం ఎక్కలేక ప్రాణాలతో బయటపడింది.