అక్షరటుడే, వెబ్డెస్క్: MLC Teenmar Mallanna | తెలంగాణ భావాజాలాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఆనవాళ్లు తెలంగాణలో లేకుండా చేయాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (MLC Teenmar Mallanna) డిమాండ్ చేశారు.
హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ (KBR Park) వద్ద బీసీ నాయకులతో కలిసి ఆయన శనివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ.. కేబీఆర్ పార్క్ పేరును తక్షణమే మార్చాలని, ప్రస్తుతమున్న కాసు బ్రహ్మానందరెడ్డి పేరును తొలగించి, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ (Professor Jayashankar) పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే, పార్కు ఎదురుగా ఉన్న కాసు విగ్రహాన్ని తొలగించి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని నెలకొల్పాలని ప్రభుత్వాన్ని కోరారు.
MLC Teenmar Mallanna | తెలంగాణ వ్యతిరేకుల ఆనవాళ్లు తొలగించాల్సిందే..
తెలంగాణ ప్రజల గోస పోసుకుని, తెలంగాణ సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన ఆనవాళ్లు ఇంకా కొనసాగించడం సరికాదని మల్లన్న అన్నారు. “కేబీఆర్ పార్క్ (KBR Park) పేరును వెంటనే తొలగించి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టాలి. ఒకవేళ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టకపోతే, బీసీ సర్కారు ఏర్పాటు కాగానే ఆ పని పూర్తి చేస్తాం” అని స్పష్టం చేశారు. అంతేకాకుండా, కేబీఆర్ పార్క్ ముందు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
భవిష్యత్తులో బీసీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి (Kasu Brahmananda Reddy) విగ్రహాన్ని జేసీబీల సాయంతో పెకలించివేసి, ఆ స్థానంలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని తీన్మార్ మల్లన్న తెలిపారు. కేవలం కేబీఆర్ పార్క్ మాత్రమే కాకుండా, హైదరాబాద్ నగరంలోని (Hyderabad City) అన్ని పార్కులకు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వారి పేర్లను పెట్టాలని డిమాండ్ చేశారు. నగరంలోని ఆసుపత్రులు, హోటళ్లు, వివిధ ప్రాంతాల పేర్లను కూడా తెలంగాణ మహనీయుల పేర్లతో మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.