అక్షరటుడే, వెబ్డెస్క్: Air India flight | అహ్మదాబాద్ ఘోర విమాన (Ahmedabad plane crash) దుర్ఘటన తర్వాత ఎయిరిండియాను చుట్టుముట్టిన కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. తరచూ తలెత్తుతున్న సాంకేతిక లోపాలతో ఆ సంస్థ విమానాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సోమవారం ఢిల్లీ నుంచి జమ్మూకు (Delhi to Jammu) వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం (Air India Express flight) టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య (technical glitch) తలెత్తడంతో వెనక్కి తిరిగి వచ్చింది.. IX2564 విమానం దేశ రాజధాని నుంచి జమ్మూకు బయల్దేరింది. కానీ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సమస్యను గుర్తించిన పైలట్ ప్రొటోకాల్ లో భాగంగా ఢిల్లీకి తిరిగి వచ్చి సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. “సాంకేతిక సమస్య కారణంగా విమానం ఢిల్లీకి తిరిగి వచ్చింది. ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేశామని” ఎయిరిండియా అధికారి ఒకరు తెలిపారు. జీపీఎస్ ఇంటర్ఫియరెన్స్ (GPS interference) జరిగినట్లు అనుమానం రావడంతో ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని తిరిగి ఢిల్లీకి సురక్షితంగా చేర్చినట్లు చెప్పారు.
Air India flight | దుబాయ్ విమానంలోనూ..
అంతకు ముందు జైపూర్ నుంచి దుబాయ్ (Jaipur to Dubai) వెళ్లాల్సిన మరో ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానం (IX-195) టేకాఫ్ కు ముందు తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా రద్దు చేయాల్సి వచ్చింది. ఉదయం 5:30 గంటలకు బయల్దేరాల్సిన విమానం రన్వే (runway) వైపు టాక్సీయింగ్ ప్రారంభించగానే, పైలట్ కాక్పిట్ లో లోపం గుర్తించాడు. దీంతో వేగంగా స్పందించిన, పైలట్ విమానాన్ని ఆప్రాన్ కు తిరిగి తీసుకొచ్చాడు. ఇంజినీర్ల సహాయంతో దాదాపు నాలుగు గంటల పాటు సమస్యను సరిదిద్దే ప్రయత్నాలు కొనసాగాయి. కానీ సమస్య పరిష్కారం కాలేదు. ఈ సమయంలో, ప్రయాణికులు విమానం లోపలే కూర్చుని ఉన్నారు. చివరికి, విమానయాన సంస్థ విమానాన్ని రద్దు చేయాలని నిర్ణయించుకుంది. మరోవైపు ఆదివారం ఢిల్లీ నుంచి తిరువనంతపురం (Delhi to Thiruvananthapuram) వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ల్యాండింగ్ సమయంలో పక్షి ఢీకొట్టినట్లు గుర్తించారు.దీంతో తిరువనంతపురం నుండి ఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం AI2455 రద్దు చేశారు.