అక్షరటుడే, వెబ్డెస్క్: Spice Jet | అహ్మదాబాద్ విమాన దుర్ఘటన(Ahmedabad plane crash) తర్వాత విమానాల్లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గురువారం ఉదయం ఢిల్లీ నుంచి లేహ్కు బయలుదేరిన ఇండిగో విమానం(Indigo Flight) 6E సాంకేతిక కారణాల వల్ల అత్యవసరంగా ల్యాండింగ్(Emrgency Landing) చేయాల్సి వచ్చింది. సిబ్బందితో సహా దాదాపు 180 మందితో కూడిన విమానం లేహ్కు చేరుకున్న కొద్దిసేపటికే వెనక్కి తిరిగి ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు, గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి తిరుపతికి బయలు దేరిన స్పైస్ జెట్(Spice Jet) విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. మరో 10 నిమిషాల్లో తిరుపతిలో ల్యాండ్ కావాల్సిన విమానం తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్టు(Shamshabad Airport)కు మళ్లించారు. దీంతో తిరుపతి వెళ్లాల్సిన ప్రయాణికులు తిరిగి శంషాబాద్కు రావడంతో ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతిక సమస్యపై స్పైస్ జెట్ యాజమాన్యం ఇంకా ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
Spice Jet | తరచూ సమస్యలు..
విమానాల్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండడం ప్రయాణికులను కలవరపాటుకు గురి చేస్తోంది. అహ్మదాబాద్లో ఎయిరిండియా విమాన ప్రమాదంలో వందలాది మంది మృత్యువాత పడిన తర్వాత చోటు చేసుకుంటున్న సాంకేతిక సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బుధవారం భువనేశ్వర్ నుంచి కోల్కతాకు వెళ్లాల్సిన ఇండిగో విమానం 6E 6101 టేకాఫ్కు సిద్ధమవుతుతన్న తరుణంలో సాంకేతిక లోపం గుర్తించిన పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(Air Traffic Control)కు సమాచారం అందించాడు. వెంటనే స్పందించిన ATC.. టేకాఫ్ను నిలిపివేసి పార్కింగ్ బేకు తిరిగి రావాలని విమానాన్ని ఆదేశించింది. ప్రయాణికులను కిందికి దింపేసి తనిఖీలు చేపట్టారు. ఇక, రాయ్పూర్ విమానాశ్రయంలో సాంకేతిక లోపం కారణంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ-రాయ్పూర్ ఇండిగో విమానంలోని ప్రయాణికులు విమానం తలుపు జామ్ కావడంతో దాదాపు 40 నిమిషాల పాటు విమానంలోనే చిక్కుకుపోయారు.
ఈ నెల 16న శంషాబాద్ ఎయిర్పోర్టులో స్పైస్ జెట్ విమానంలో సాంకేతికలోపం తలెత్తి పొగలు రావడం తీవ్ర ఆందోళనకు గురి చేసింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన స్పైస్ జెట్ 2138 నంబర్ విమానంలో కాలిన వాసన రావడంతో ఫ్లైట్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. టేకాఫ్ ముందే విమానాన్ని నిలిపివేసి తనిఖీలు చేశారు. అయితే బయలుదేరే క్షణంలో సాంకేతికలోపం కారణంగా నిలిపివేయడంతో ప్రయాణికులు మూడున్నర గంటల పాటు ఇబ్బందులు పడ్డారు.