More
    HomeతెలంగాణPhone Tapping Case | కొలిక్కి వ‌స్తున్న ట్యాపింగ్ కేసు.. ఆధారాలు సేక‌రిస్తున్న సిట్‌

    Phone Tapping Case | కొలిక్కి వ‌స్తున్న ట్యాపింగ్ కేసు.. ఆధారాలు సేక‌రిస్తున్న సిట్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Phone Tapping Case | రాష్ట్రంలోనే కాక దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీల‌క ద‌శ‌కు చేరుకుంటోంది. త్వ‌ర‌లోనే విచార‌ణ‌ను కొలిక్కి తీసుకొచ్చేందుకు ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) ప్ర‌య‌త్నిస్తోంది. ఈ కేసులో ఇప్ప‌టికే పాత్ర‌ధారుల‌ను అరెస్టు చేసిన సిట్‌.. ప్ర‌ధాన నిందితుడు ప్ర‌భాక‌ర్‌రావు(Prabhakar Rao)ను ఐదుసార్లు విచారించింది. ఆయ‌న ద‌ర్యాప్తునకు ఏమాత్రం స‌హ‌క‌రించ‌క పోవ‌డంతో.. త‌దుప‌రి చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ప్ర‌భాక‌ర్‌రావును అరెస్టు చేయొద్ద‌న్న సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశాలున్న త‌రుణంలో నేప‌థ్యంలో ద‌ర్యాప్తు బృందం కోర్టును ఆశ్ర‌యించ‌నుంది. మ‌రోవైపు, ఈ కేసులో బాధితులుగా ఉన్న వారిని గుర్తించిన సిట్(Sit) వారిని విచార‌ణ‌కు రావాల‌ని నోటీసులు జారీ చేస్తోంది. ఇప్ప‌టికే పీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్‌గౌడ్(PCC Chief Mahesh Kumar Goud) సిట్ ఎదుట హాజ‌రై వాంగ్మూలం ఇచ్చారు. అలాగే చాలా మంది బాధితులు జూబ్లీహిల్స్‌లోని సిట్ ఆఫీస్‌కు క్యూ క‌ట్టారు. తాజాగా కేంద్ర మంత్రి, బీజేపీ ముఖ్య నేత బండి సంజ‌య్‌(Bandi Sanjay)ను కూడా విచార‌ణ‌కు రావాల‌ని సిట్ కోరింది. అలాగే, ఇత‌ర బీజేపీ, కాంగ్రెస్ నేత‌ల‌కు సైతం నోటీసులు జారీ చేయ‌నుంది.

    Phone Tapping Case | వేలాది మంది ఫోన్లు ట్యాప్‌..

    బీఆర్ఎస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో రాష్ట్రంలో వేలాది మంది ఫోన్లు ట్యాపింగ్(Phone Tapping) అయిన‌ట్లు సిట్ గుర్తించింది. ఇందులో ప్ర‌ధానంగా రాజకీయ నాయ‌కులు, పారిశ్రామిక‌వేత్త‌ల‌తో పాటు సెల‌బ్రిటీలు కూడా ఉన్న‌ట్లు విచార‌ణ‌లో తేలింది. తొలుత 400 మంది ఫోన్లు మాత్ర‌మే ట్యాప్ అయ్యాయ‌ని భావించిన‌ప్ప‌టికీ, సిట్ ద‌ర్యాప్తు లోతుగా వెళ్తున్న త‌రుణంలో ఆ సంఖ్య రెట్టింప‌యింది. వెయ్యి మందికి పైగా ఫోన్లు ట్యాప్ అయిన‌ట్లు ద‌ర్యాప్తు బృందం గుర్తించింది. ప్ర‌ధానంగా గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో నామినేష‌న్ ఉప‌సంహ‌ర‌ణ‌కు తుది గ‌డువు రోజు వెయ్యి మందికి పైగా ఫోన్ల‌ను ట్యాపింగ్ చేసిన‌ట్లు గుర్తించి, వారిని సాక్షులుగా విచారణ‌కు రావాల‌ని పిలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను సిట్ సంప్ర‌దించింది. మీ ఫోన్ కూడా ట్యాప్ అయింద‌ని, సాక్షిగా వాంగ్మూలం ఇవ్వాల‌ని కోర‌గా, టైమ్ చూసుకుని వ‌స్తాన‌ని సంజ‌య్ తెలిపారు.

    READ ALSO  KTR | కేటీఆర్​ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. అరెస్టు తప్పదా..!

    Phone Tapping Case | సాక్ష్యాలు దొర‌క్కుండా కుట్ర‌..

    ఫోన్ ట్యాపింగ్‌కు పాల్ప‌డిన నిందితులంతా పోలీసులు కావ‌డంతో ప‌క్కాగా వ్య‌వ‌హరించారు. ఎక్క‌డా సాక్ష్యాలు దొర‌క‌కుండా వ్య‌వ‌హ‌రించారు. ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలోని ఎస్‌ఐబీ బృందం తమ తప్పులు బయటపడకుండా పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరించిందని.. అవసరం తీరగానే ట్యాపింగ్‌ సాక్ష్యాలను నాశనం చేసుకుంటూ వచ్చిందని సిట్ గుర్తించింది. ట్యాపింగ్‌ డేటా(Tapping Data)ను ధ్వంసం చేయడంలో ప్రణీత్‌రావు(Praneeth Rao) కీలకపాత్ర వహించినట్టు తేల్చింది. ఈ క్రమంలో మావోయిస్టులకు సంబంధించిన డేటా కూడా పోయిందని సిట్‌ అధికారులు చెబుతున్నారు. 42 హార్డ్‌ డిస్క్‌ల్లోని డేటాను ధ్వంసం చేయడంలో ప్రణీత్‌రావు సఫలమైనా, పాత కంప్యూటర్లు, మిగిలిన హర్డ్‌డిస్క్​ల నుంచి కీల‌క స‌మాచారం సేక‌రించిన‌ట్లు తెలిసింది. 2023 నవంబర్‌ నెలలో చేసిన ఫోన్‌ ట్యాపింగ్‌ వివరాలను అధికారులు రిట్రీవ్‌ చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో సుమారు 650 ఫోన్‌ నంబర్లకు సంబంధించి 15 రోజుల డేటా లభించడంతో దాని ఆధారంగా ఆ ఫోన్‌ నంబర్లను వినియోగిస్తున్న వారిని సిట్‌ అధికారులు పిలిచి, సాక్షులుగా వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. సిట్‌కు దొరికిన డేటాలో సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) సన్నిహితులు, కుటుంబ సభ్యులతోపాటు పొంగులేటి సహా కొందరు రాష్ట్ర మంత్రుల ఫోన్‌ నంబర్లు కూడా ఉన్నట్టు గుర్తించారు.

    READ ALSO  Phone Tapping Case | ఫోన్​ ట్యాపింగ్​ కేసులో కేసీఆర్​ తప్పించుకోలేరు.. గోనె ప్రకాశ్​ సంచలన వ్యాఖ్యలు

    Phone Tapping Case | ప్ర‌భాక‌ర్‌రావు పోలీసు తెలివితేట‌లు..

    ట్యాపింగ్ అంశం బ‌య‌ట‌కు రావ‌డంతో కీల‌క నిందితుడైన ప్ర‌భాక‌ర్‌రావు అమెరికా(America)కు పారిపోయాడు. అయితే, సిట్ అన్ని వైపుల నుంచి ఉచ్చు బిగుస్తుండ‌డంతో అరెస్టు నుంచి కాపాడాల‌ని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. దీంతో ఆయ‌న‌ను అరెస్టు చేయొద్ద‌న్న న్యాయ‌స్థానం.. సిట్ ద‌ర్యాప్తునకు స‌హ‌క‌రించాల‌ని ఆదేశించింది. దీంతో అమెరికా నుంచి తిరిగి వ‌చ్చిన ప్ర‌భాక‌ర్‌రావు సిట్ ముందు హాజ‌ర‌వుతున్నారు. ఈ క్ర‌మంలో ద‌ర్యాప్తుకు స‌హ‌క‌రించ‌కుండా త‌న పోలీసు తెలివి తేట‌లు వాడుతున్న‌ట్లు తెలిసింది. విచార‌ణ‌లో త‌న‌కు తెలియ‌ద‌ని, మ‌ర్చిపోయాన‌ని స‌మాధానాలిస్తున్నారు. ఒకరిద్దరు సాక్షులను ఎదురుగా కూర్చోపెట్టి ‘వారు మావోయిస్టులు కారు. అయినా వారి ఫోన్లు ఎందుకు ట్యాపింగ్‌ చేయించారు?’ అని సిట్‌ అధికారులు ప్రశ్నిస్తే తనకేమీ గుర్తులేదని, కింది సిబ్బంది పంపిన ఫోన్‌ నంబర్లను ట్యాపింగ్‌ అనుమతి కోసం రివ్యూ కమిటీకి పంపానని ప్రభాకర్‌రావు చెప్పినట్టు తెలిసింది. ప్రముఖ రాజకీయ నాయకుల ఫోన్లను ఎందుకు ట్యాప్‌ చేశారని ప్ర‌శ్నిస్తే అప్ప‌టి డీజీపీలు ఇంటెలిజెన్స్‌ చీఫ్ చెప్పడంతో త‌న ఆ ఆదేశాలు పాటించిన‌ట్లు బ‌దులిచ్చిన‌ట్లు తెలిసింది. ఈ నేప‌థ్యంలో మాజీ డీజీపీల‌ను కూడా విచారించి.. స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డ్ చేయాల‌ని సిట్ యోచిస్తున్న‌ట్లు స‌మాచారం.

    READ ALSO  Cabinet Meeting | 23న తెలంగాణ కేబినెట్​ భేటీ

    Phone Tapping Case | మరోసారి విచారణకు ప్రణీత్​రావు

    ఫోన్​ ట్యాపింగ్​ కేసులో ఏ2 ప్రణీత్​రావును శనివారం మరోసారి సిట్​ అధికారులు విచారిస్తున్నారు. ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు ఈ కేసులో కీలకంగా వ్యవహరించారు. అంతేగాకుండా ఫోన్​ ట్యాపింగ్​ ఆధారాలను ధ్వంసం చేశాడు. అప్పటి డీజీపీ చెప్తేనే ఫోన్‌ట్యాపింగ్‌ చేశామన్న ప్రధాన నిందితుడు ప్రభాకర్​రావు తెలిపారు. దీంతో ప్రభాకర్‌రావు వాంగూల్మంపై ప్రణీత్‌రావు సమాధానం కీలకంగా మారనుంది.

    Latest articles

    Haryana | ప్రాణం తీసి.. పారిపోయిందని చెప్పారు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Haryana | ఓ వివాహితను అత్తింటి వారు హత్య చేశారు. ఇంటి ఆవరణలోనే ఆమెను పూడ్చి పెట్టి.....

    RTC Tour Package | యాదగిరిగుట్ట, స్వర్ణగిరికి ప్రత్యేక బస్సు

    అక్షరటుడే, ఇందూరు: RTC Tour Package | నిజామాబాద్ నుంచి ఈనెల 27వ తేదీన యాదగిరిగుట్ట (Yadagiri Gutta)...

    Rain Alert | రాష్ట్రానికి భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rain Alert | వాతావరణ శాఖ రైతులకు చల్లని కబురు చెప్పింది. గత నాలుగైదు రోజులుగా...

    Tamilnadu Governor | 73 ఏళ్ల వయసులో ఏకంగా 51 పుషప్స్ .. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన గ‌వ‌ర్న‌ర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Tamilnadu Governor | అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) సందర్భంగా సెలబ్రిటీల నుంచి రాజకీయ...

    More like this

    Haryana | ప్రాణం తీసి.. పారిపోయిందని చెప్పారు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Haryana | ఓ వివాహితను అత్తింటి వారు హత్య చేశారు. ఇంటి ఆవరణలోనే ఆమెను పూడ్చి పెట్టి.....

    RTC Tour Package | యాదగిరిగుట్ట, స్వర్ణగిరికి ప్రత్యేక బస్సు

    అక్షరటుడే, ఇందూరు: RTC Tour Package | నిజామాబాద్ నుంచి ఈనెల 27వ తేదీన యాదగిరిగుట్ట (Yadagiri Gutta)...

    Rain Alert | రాష్ట్రానికి భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rain Alert | వాతావరణ శాఖ రైతులకు చల్లని కబురు చెప్పింది. గత నాలుగైదు రోజులుగా...