అక్షరటుడే, వెబ్డెస్క్:Tamil Nadu | తమిళనాడులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ స్కూల్ బస్సు(School Bus)ను రైలు ఢీకొంది. తమిళనాడులోని కడలూరు(Cuddalore)లో ఓ స్కూల్ బస్సు పట్టాలు దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు ఢీకొంది. దీంతో బస్సు పట్టాలపై ఎగిరి పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా.. 15 మంది విద్యార్థులు(Students) గాయపడ్డారు.
స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే పలువురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చెమ్మంగుప్పంలో రైల్వే గేటు(Chemmanguppam Railway Gate) దాటుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే రైలు వచ్చే సమయంలో గేటు వేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే అధికారులు(Railway Officers) సైతం ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
గతంలో తెలంగాణలోని మెదక్ జిల్లా మాసాయిపేటలో సైతం ఓ స్కూల్ బస్సును రైలు ఢీకొన్న విషయం తెలిసిందే. 40 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్సును లెవల్ క్రాసింగ్ వద్ద నాందేడ్-హైదరాబాద్ ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పదహారు మంది విద్యార్థులు, డ్రైవర్ క్లీనర్ మరణించారు. అక్కడ రైల్వే గేటు లేకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన తర్వాత రైల్వే శాఖ దేశవ్యాప్తంగా క్రాసింగ్ల వద్ద రైల్వే గేట్లను ఏర్పాటు చేసింది. అయినా తాజాగా చెన్నైలో ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం.
Read all the Latest News on Aksharatoday.in