అక్షరటుడే, వెబ్డెస్క్: TV Anchor Swetcha | టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్వేచ్ఛ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వేచ్ఛ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో, స్వేచ్ఛ(TV Anchor Swetcha) తండ్రి శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా కూతురు మరణానికి పూర్ణచందర్ అనే వ్యక్తి కారణమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శంకర్ మాట్లాడుతూ.. “పూర్ణచందర్ గత మూడు సంవత్సరాల నుంచి నా కూతుర్ని వేధిస్తున్నాడు. అతడి వేధింపుల వల్లే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుంది” అని అన్నారు.
పూర్ణచందర్ (Poorna Chander) తన కూతుర్ని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినట్టు తెలిపారు. అయితే నా కూతురు పెళ్లికి అంగీకరించిన తరువాత పూర్ణచందర్తో అనేక గొడవలు జరిగాయి. ఈ గొడవలు తీవ్రంగా మారడంతో, జూన్ 26న నా కూతురు అతడితో కలిసి ఉండలేనని స్పష్టం చేసింది. ఆ రోజు నేను స్వేచ్ఛతో మాట్లాడాను, పూర్ణచందర్తో సంబంధం కొనసాగించలేనని అంగీకరించింది. అతడి వేధింపుల వల్ల ఆమె తీవ్ర మానసిక వేదనకు గురై, ఆ వేదనతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందన్నారు. పెళ్లి అయినప్పటికీ భర్తతో విబేధాల కారణంగా విడిపోయిన స్వేచ్ఛ కొంత కాలంగా తల్లిదండ్రులతో కలిసి ఉండి ఆ తరువాత తన కుమార్తెతో విడిగా ఉంటోంది. ఈ క్రమంలో గత రాత్రి తన నివాసంలోనే స్వేచ్ఛ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
మరోవైపు, స్వేచ్ఛ మృతదేహానికి గాంధీ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం స్వేచ్ఛ మృతదేహాన్ని రాంనగర్లోని పార్సీగుట్ట(Ramnagar Parsigutta)కు తరలించారు. అక్కడ ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పోస్టుమార్టం తరువాత గాంధీ మార్చురీ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడకు చేరుకున్న బీఆర్ఎస్ నేతలు(BRS Leaders) మరియు ప్రజాసంఘాల నేతలు, స్వేచ్ఛ తండ్రిని పరామర్శించి ఆయనను ఓదార్చారు. ఈ దు:ఖ దాయక సమయంలో స్వేచ్ఛ కుటుంబం సభ్యులు ఆమె కళ్లను దానం చేశారు. దీంతో, గాంధీ ఆస్పత్రి వైద్యులు(Gandhi Hospital Doctors) స్వేచ్ఛ కళ్లను సేకరించారు.