అక్షరటుడే, వెబ్డెస్క్: Yadadri District | అనుమానాస్పద స్థితిలో యాదగిరిగుట్ట (Yadagirigutta) పట్టణంలోని ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఇంట్లో ఓ వ్యక్తి ఉరి వేసుకుని మృతి చెందాడు. ఎమ్మెల్యే ఇంట్లోని పెంట హౌస్ లో అద్దెకు ఉంటున్న గంధమల్ల రవి ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.
ఇటీవల కాలంలో రవిని ఎమ్మెల్యే మందలించినట్లు సమాచారం. రెండు రోజులుగా మృతుడి సొంత గ్రామమైన సైదాపురంలోనే ఉన్న అతను ఎమ్మెల్యే ఇంట్లోనే ఉరి వేసుకుని మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఆత్మహత్యకు పాల్పడాలంటే సైదాపురంలోని ఇంట్లో ఉరివేసుకుని ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు తన భార్యతో కలిసి గత కొన్నేళ్లుగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య (MLA Beerla Ailaiah) ఇంట్లో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా మృతదేహాన్ని భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఇంట్లో గంధమల్ల రవి పలు కారణాలతో మృతి చెందిన సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య (Karre Venkataiah) ఆరోపించారు. ఆయన ఎందుకు ఉరివేసుకోవాల్సి వచ్చిందో అర్థం కావడం లేదని.. రాత్రికి రాత్రి మృతదేహాన్ని భువనగిరికి తరలించారని చెప్పారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.