అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Trap | రాష్ట్రంలోని పలు తహశీల్దార్ కార్యాలయాలు (Tahsildar offices) అవినీతికి కేరాఫ్ గా మారాయి. ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేసే ఆపరేటర్(Operator) నుంచి మొదలు పెడితే తహశీల్దార్ (Tahsildar ) వరకు లంచాలు తీసుకుంటున్నారు. లంచం ఇవ్వకపోతే పనులు చేయడం లేదు. అన్ని ఉన్నా.. కొర్రీలు పెడుతూ ప్రజలను లంచాల కోసం పట్టి పీడిస్తున్నారు. తాజాగా లంచం తీసుకుంటూ ఓ సర్వేయర్ ఏసీబీకి చిక్కాడు.
రాజన్న సిరిసిల్ల (Rajanna Siricilla) జిల్లా ఎల్లారెడ్డిపేట (Yellareddypeta) మండలం చంద్రంపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి సర్వే నివేదిక అందించడానికి సర్వేయర్ నాగరాజు రూ.80 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు (ACB Officers) సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలో శనివారం సర్వేయర్ గ్రామంలో బాధితుడి నుంచి రూ.15 వేల లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ACB Trap | భయం లేకుండా..
అవినీతి అధికారులు భయం లేకుండా లంచాలు (Bribe demand) తీసుకుంటున్నారు. తమను ఎవరు ఏమీ చేయరనే ధీమాతో లంచాలు అడుగుతున్నారు. నిత్యం ఏసీబీ దాడుల్లో పలువురు దొరుకుతున్నా.. కనీసం జంకడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కొందరైతే లంచం తీసుకోవడం తమ హక్కుగా భావిస్తున్నారు. మెదక్(Medak) జిల్లాలోని ఓ తహశీల్దార్ కార్యాలయంలో పనిచేసే ఓ అధికారి తన వద్దకు పౌతి(సక్సెషన్) కోసం వచ్చే వారి వద్ద డబ్బులు తీసుకునే సంతకం పెడతాడు. డబ్బులు ఇవ్వకపోతే ఆ పత్రాలను తన వద్దే ఉంచుకుంటాడు. ఇలా అన్ని కార్యాలయాల్లో అవినీతి అధికారులు తిష్ట వేశారు. కింది స్థాయి సిబ్బంది అవినీతి గురించి తెలిసినా సంబంధిత ఉన్నతాధికారులు చర్యలు చేపట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
ACB Trap | భయపడొద్దు.. ఫిర్యాదు చేయండి
ప్రజలు ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు (ACB Officers) సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా తమకు ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number)కు ఫోన్ చేస్తే అవినీతి అధికారుల పని చెబుతామని పేర్కొంటున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, సదరు పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు.