అక్షరటుడే, న్యూఢిల్లీ: నీట్(పీజీ) NEET (PG) విషయంలో సుప్రీం కోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ జాతీయ ప్రవేశ పరీక్షను ఒకే షిఫ్టులో నిర్వహించాలని బోర్డుకు ఆదేశాలిచ్చింది. జూన్ 15న జరగనున్న నీట్(పీజీ)ను రెండు షిఫ్టులలో నిర్వహించాలన్న నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (National Board of Examinations) నిర్ణయాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
ఈ పరీక్షను ఒకే షిఫ్ట్లో నిర్వహిస్తే.. విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించడంతో పాటు, పరీక్ష నిర్వహణ ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించవచ్చని అభిప్రాయపడింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ ఎన్వీ అంజారియా(Justice Vikram Nath, Justice Sanjay Kumar and Justice NV Anjaria) సభ్యులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఒకే షిఫ్టులో పరీక్ష నిర్వహించేందుకు కేంద్రాలు, సమయం సరిపోదంటూ ఎస్ఈబీ SEB వినిపించిన వాదనను సుప్రీం తోసిపుచ్చింది. పరీక్ష నిర్వహణ ఏర్పాట్లు చేసేందుకు జూన్ 15 వరకు సమయం ఉందని అభిప్రాయపడింది.
ఏమిటీ ఈ పరీక్ష అంటే..
నీట్(పీజీ) అనేది దేశంలో వైద్య విద్యలో ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా కోర్సు(MD, MS, PG diploma courses)ల్లో చేరడానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు భర్తీ చేస్తారు. దీనిని ఎన్బీఈ నిర్వహిస్తుంది. దీని ఫలితాల ఆధారంగా విద్యార్థులకు ర్యాంకులు, సీట్లు కేటాయిస్తారు.
గతంలో ఇలా..
ఈ ఏడాది, నీట్ పీజీ 2025 (NEET PG 2024)ని జూన్ 15న నిర్వహించి, జులై 15న ఫలితాలు ప్రకటించాలని ఎన్బీఈ నిర్ణయించింది. గతంలో నీట్ పీజీ 2024ని రెండు షిఫ్టులలో చేపట్టారు. ఈ రెండు షిఫ్టులలోనూ వేర్వేరు ప్రశ్నపత్రాలు ఉండటం వల్ల, ఒకదానిలోని ప్రశ్నలు సులభంగా, మరొకదానిలోని ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విభిన్న స్థాయిలను సమతుల్యం చేయడానికి ఎన్బీఈ సాధారణ పద్ధతిని వినియోగించింది. అయినా, ఈ నార్మలైజేషన్ ప్రక్రియ పారదర్శకత లేకపోవడం, స్కోర్లలో అసమానతలు.. తదితర సమస్యలు ఏర్పడ్డాయి. అందువల్లే తమ ర్యాంకులు తక్కువగా వచ్చాయని చాలా మంది విద్యార్థులు ఫిర్యాదు చేశారు. అందుకే నీట్ పీజీ ప్రవేశ పరీక్షను రెండు షిఫ్టులలో నిర్వహించాలన్న ఎన్బీఈ నిర్ణయాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు.