అక్షరటుడే, వెబ్డెస్క్ : Cabinet Expansion | సుదర్శన్రెడ్డి (Sudarshan Reddy).. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సీనియర్ ఎమ్మెల్యేల్లో ఈయన ఒకరు. పైగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు సైతం పీసీసీ కోశాధికారిగా ఉండి అన్నీ తానై వ్యవహరించారు. తీరా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆయన ఎమ్మెల్యేగా గెలిచినా.. మంత్రి పదవి అందని ద్రాక్షగానే మారింది. రెండో విడత మంత్రివర్గ విస్తరణలో కూడా ఆయన పేరు లేకపోవడం సర్వత్రా చర్చకు దారితీసింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నుంచి సుదర్శన్రెడ్డి, షబ్బీర్ అలీ సీనియర్ నాయకులుగా ఉన్నారు. అయితే షబ్బీర్ అలీ(Shabbir Ali) ఎమ్మెల్యేగా ఓడిపోయారు. దీంతో బోధన్ ఎమ్మెల్యేగా గెలిచిన సుదర్శన్రెడ్డికి మొదటి విడతలోనే మంత్రి పదవి వస్తుందని అంతా అనుకున్నారు. గతంలో వైఎస్, రోశయ్య హయంలో కీలక శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. జిల్లాలో సీనియర్ నాయకుడు కావడంతో పదవి వస్తుందని అంతా ఆశించారు. అయితే అప్పుడు ఆయనకు పదవి రాలేదు. దీంతో రెండో విడతలో మంత్రి పదవి ఖాయం అనే వార్తలు వచ్చాయి. ఆయనే స్వయంగా తన అనుచరగణంకు ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఒక దశలో ‘హోంమంత్రి పదవి” అని కూడా లీకులిచ్చారు. చివరకు ఆయనకు మంత్రి పదవి ఊరించి ఉసూరుమనిపించింది.
Cabinet Expansion | ఉమ్మడి జిల్లాకు దక్కని ప్రాధాన్యం
ప్రస్తుత మంత్రివర్గం(Cabinet)లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లేదు. ఉమ్మడి జిల్లా నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో సుదర్శన్రెడ్డి సీనియర్ కావడంతో ఆయనకు రెండో విడతలో మంత్రి పదవి వస్తుందని వార్తలు వచ్చాయి. వీలుకాని పక్షంలో.. షబ్బీర్ అలీ లేక మదన్ మోహన్ రావు, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావుకు పదవి రావొచ్చని అంతా భావించారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆఖరకు ఉమ్మడి జిల్లాకు నిరాశే మిగిలింది. కాగా.. మంత్రి పదవి చివరి ఆశగా ఉన్న సుదర్శన్రెడ్డి.. తాజా పరిణామాలను ఏ విధంగా చూస్తారు..? ఎలా తీసుకుంటారు..? తన అనుచరగణంకు ఏమని సమాధానం ఇస్తారు..? అనే చర్చ జరుగుతోంది.
Cabinet Expansion | పార్టీ నాయకులు ఎవరికి వారే..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కాంగ్రెస్కు పెద్దదిక్కుగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఉన్నారు. కానీ ప్రొటోకాల్ పరంగా రాష్ట్ర మంత్రి వర్గంలో జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేకపోవడంతో కిందిస్థాయి నేతలు, నాయకులు గందరగోళంలో ఉన్నారు. ప్రత్యేకించి పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. పార్టీలో అంతర్గతంగా ఏవైనా విభేదాలు వచ్చినా, ఇతర ఇబ్బందుల తలెత్తినా చెప్పుకునేందుకు ఎవరూ లేకపోయారు. మంత్రి పదవి లేకపోవడం జిల్లా అభివృద్ధిపై ప్రభావం చూపిస్తుంది. అధికారులు సైతం ప్రభుత్వం వద్ద నివేదించాలనుకునే పనుల విషయంలో ఎవరికి చెప్పాలో తెలియక ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. పైపైచ్చు పీసీసీ చీఫ్గా జిల్లాకు చెందిన మహేష్ ఉమ్మడి నిజామాబాద్కు న్యాయం జరగకపోవడంపై గమనార్హం.