అక్షరటుడే, వెబ్డెస్క్:Kamareddy | కామారెడ్డిలో ఆధిపత్య పోరు రోజురోజుకు తీవ్రమవుతోంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య నెలకొన్న వైరం తారస్థాయికి చేరింది.
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి(MLA Katipalli Venkataramana Reddy), మాజీ ఎమ్మెల్యే షబ్బీర్ అలీ(former MLA Shabbir Ali) మధ్య ముదిరిన వివాదం చర్చనీయాంశమైంది. పోరుగడ్డపై కొనసాగుతున్న ఆధిపత్య పోరు ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. ఇద్దరి రాజకీయ పోరు కారణంగా అటు అధికారులు, ఇటు సామాన్యులు నలిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకరేమో ఎమ్మెల్యే, మరొకరేమో ప్రభుత్వ సలహాదారు.. దీంతో ప్రొటోకాల్ విషయంలో తలెత్తుతున్న వివాదం అధికారులకు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టగా, రాజకీయ వైరం కారణంగా నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడుతోంది.
Kamareddy | ప్రొటోకాల్ వివాదం..
అసెంబ్లీ ఎన్నికల తర్వాత కామారెడ్డి సంచలనానికి కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడ పోటీ చేసిన ఇద్దరు కీలక నేతలను (కేసీఆర్, రేవంత్రెడ్డి) ఓడించి బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి (కేవీఆర్) సంచలన విజయం సాధించారు. ఆ తర్వాత రాష్ట్రంలో అధికారం చేపట్టిన, షబ్బీర్ అలీని సలహాదారుగా నియమించింది. దీంతో అప్పటి నుంచి కామారెడ్డి(Kamareddy)లో ఆధిపత్య పోరు ముదిరింది. వీరిద్దరి నడుమ అధికారులు నలిగి పోతున్నారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు ఎవరిని పిలువాలో, ఎవరిని పిలువొద్దో తెలియక సతమతమవుతున్నారు.
Kamareddy | ఎవరికి వారే..
ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కేవీఆర్.. అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ స్పష్టమైన సూచనలు చేశారు. ఎవరైనా తమ పరిధి మేరకే పని చేయాలని, అవినీతి, అక్రమాలకు పాల్పడితే ఊరుకోనని హెచ్చరించారు. అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో నూతన భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా తలెత్తిన ప్రొటోకాల్ రగడ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అప్పట్లో షబ్బీర్ అలీ(Shabbir Ali) ఒత్తిడి కారణంగా అధికారులు అప్పటికప్పుడు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయగా, దీనిపై కాటిపల్లి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఇన్చార్జి మంత్రి జూపల్లి(Incharge Minister Jupally) తన పర్యటనను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. మరోవైపు, షబ్బీర్ అలీ ప్రారంభోత్సవానికి వస్తున్నారని తెలిసి ఎమ్మెల్యే కేవీఆర్ ఆస్పత్రిలోనే తిష్ట వేసి వైద్యులకు చెమటలు పట్టించారు. అప్పటినుంచి మొదలైన ప్రోటోకాల్ సమస్య.. చెక్కుల పంపిణీ నుంచి సమీక్ష సమావేశాల వరకు కొనసాగుతూ వస్తోంది.
Kamareddy | ఇందిరమ్మ మోడల్ ఇంటితో..
ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల(Indiramma Houses) నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కామారెడ్డి నియోజకవర్గంలో అక్కడక్కడా మోడల్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. బీబీపేటలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ ఇంటిని గురువారం ప్రారంభించేందుకు షబ్బీర్ అలీ తన షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. అయితే చివరి క్షణంలో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి అధికారులకు ఫోన్ చేసి “ఎలా వస్తాడో చూస్తా.. ధర్నా చేస్తా.. ప్రొటోకాల్ పట్టదా” అంటూ మాట్లాడారని షబ్బీర్ అలీ కార్యకర్తల సమావేశంలో వెల్లడించారు. దీంతో ఇద్దరి మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు తాజాగా మరోమారు రచ్చకెక్కింది.
Kamareddy | కుంటుపడుతున్న అభివృద్ధి
కామారెడ్డి నియోజకవర్గంలో వీరిద్దరి తీరుతో అభివృద్ధి పనులకు బ్రేక్ పడుతోంది. ప్రొటోకాల్ వివాదం కారణంగా ప్రారంభోత్సవాలు వాయిదా పడుతుండడం, పథకాల అమలు అటకెక్కుతుండడంతో సామాన్యులు నష్టపోతున్నారు. ఇద్దరు నేతల రాజకీయాలకు తామెందుకు బలి కావాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీలో ఉన్న షబ్బీర్ అలీ, ప్రతిపక్షంలో ఉన్న కేవీఆర్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధులు తీసుకు రావాల్సింది పోయి.. ఇలా తగువులాడుకోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. కామారెడ్డికి రావాల్సిన నిధులు, వసతులు పక్కా నియోజకవర్గ ఎమ్మెల్యే(MLA)లు తన్నుకుపోతున్నారనే ఆగ్రహం ప్రజల్లో బలంగా వ్యక్తమవుతోంది. ఎన్నికలప్పుడే రాజకీయాలు అని పైకి చెప్తున్నా ఆధిపత్య పోరుతో ప్రజలు నష్టపోతున్నా ఇద్దరు నేతలు మాత్రం వెనుకడుగు వేయడం లేదు. అభివృద్ధి విషయంలో షబ్బీర్ అలీతో సఖ్యతగా ఉండటమో లేదా నిధులపై సీఎంను కలవడంలో ఎమ్మెల్యే చొరవ చూపడం లేదన్న వాదన ఒకవైపు.. అధికారంలో ఉండి కూడా నిధులు పక్క నియోజకవర్గాలకు వెళ్తుంటే షబ్బీర్ అలీ చూస్తూ ఉండిపోతున్నారనే వాదన మరోవైపు.. మొత్తంగా ప్రజల్లో మాత్రం ఈ ఇద్దరు నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.