అక్షరటుడే, వెబ్డెస్క్: Srisailam Project | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది(Krishna River)కి భారీగా వరద వస్తోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్ (Srisailam Project) నిండుకుండలా మారింది. సుంకేశుల, జురాల ప్రాజెక్టుల నుంచి జలాశయానికి 1.70 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882 అడుగులకు నీరు చేరింది. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) మంగళవారం మధ్యాహ్నం ప్రాజెక్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదలను ప్రారంభించారు.
Srisailam Project | నాలుగు గేట్ల ద్వారా..
ఏపీ సీఎం చంద్రబాబు ముందుగా శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి ఆలయం(Mallikarjuna Swamy Temple)లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కృష్ణమ్మకు పసుపు, కుంకుమ, చీర సమర్పించారు. తర్వాత జలాశయం 6, 7, 8, 11 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదలను ప్రారంభించారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగర్జున సాగర్ వైపు పరుగులు పెడుతోంది. కాగా ప్రాజెక్ట్ చరిత్రలోనే తొలిసారి జులై తొలివారంలో గేట్లు ఎత్తడం గమనార్హం. దీంతో ఆయకట్టు రైతులు(Farmers) హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే కుడి, ఎడమ జల విద్యుదుత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తి చేపడుతున్నారు. దీంతో నాగార్జున సాగర్కు ఇన్ఫ్లో వస్తోంది. ప్రస్తుతం గేట్లు ఎత్తడంతో వరద పెరగనుంది. నాగర్జున సాగర్(Nagarjuna Sagar) పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 165 టీఎంసీల నీరు ఉంది. శ్రీశైలం గేట్లు ఎత్తడంతో ఆ ప్రాజెక్ట్ నీటిమట్టం కూడా వేగంగా పెరగనుంది. దీంతో ఈ యేడు పంటలకు ఢోకా లేదని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సకాలంలో కాల్వల ద్వారా నీటి విడుదలను ప్రారంభించాలని కోరుతున్నారు.
Srisailam Project | పెరగనున్న పర్యాటకులు
శ్రీశైలం మల్లన్న దర్శనానికి నిత్యం వేల మంది భక్తులు వస్తుంటారు. మల్లన్నను దర్శించుకున్న శ్రీశైలం డ్యామ్ (Srisailam Dam)ను కూడా సందర్శిస్తారు. అయితే ప్రస్తుతం గేట్లు ఎత్తడంతో పర్యాటకులు పెరిగే అవకాశం ఉంది. కృష్ణమ్మ జల సవ్వడులు చూసేందుకు భారీగా పర్యాటకులు తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జామ్లు అయ్యే అవకాశం ఉంటుంది.