అక్షరటుడే, వెబ్డెస్క్: Karnataka CM | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను మార్చుతారన్న ఊహాగానాలకు కాంగ్రెస్ చెక్ పెట్టింది. అలాంటి నిర్ణయాలు ఏవీ తమ పరిశీలనలో లేవని స్పష్టం చేసింది. కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై కొద్దికాలంగా ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. సిద్దును మార్చి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar)ను సీఎం చేస్తారని వార్తలొచ్చాయి. ఈ మేరకు సీఎం మార్పుపై కాంగ్రెస్ అభిప్రాయ సేకరణ ప్రారంభించిందన్న ప్రచారం బలంగా తెరపైకి వచ్చింది. కానీ ఆయా ఊహాగానాలకు కాంగ్రెస్ తెర దించింది. సిద్ధరామయ్య(Karnataka CM Siddaramaiah) స్థానంలో మరో వ్యక్తిని ముఖ్యమంత్రి చేసే ఆలోచన లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ రణ్దీప్ సుర్జేవాలా(Randeep Surjewala) మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, “కర్ణాటకలో నాయకత్వ మార్పుపై తాము ఎలాంటి అభిప్రాయం తీసుకోవడం లేదు” అని చెప్పారు. ఎమ్మెల్యేలకు ఏమైనా విభేదాలుంటే పార్టీ ఫోరంలోనే చర్చించాలని సూచించామని ఆయన వెల్లడించారు.
Karnataka CM | అసంతృప్త వర్గంతో సుర్జేవాలా భేటీ..
కర్ణాటకలో నాయకత్వ మార్పు ఊహాగానాలు చెలరేగుతున్న వేళ.. ఎమ్మెల్యేలతో ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ, కర్ణాటక ఇన్చార్జి సుర్జేవాలా సమావేశమయ్యారు. అయితే, ఈ సమావేశాలను AICC. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రెండూ చేపట్టిన సంస్థాగత కసరత్తుగా పేర్కొన్నాయి. అంతేకానీ, నాయకత్వ మార్పు గురించి మీడియాలో ప్రచారమయ్యే ఏ వార్త అయినా “కల్పితం” మాత్రమే అని సుర్జేవాలా తెలిపారు. “ఈ సమావేశం రాష్ట్రాభివృద్ధికి, ఆత్మపరిశీలనకు నిరంతర కసరత్తు. ఇది చాలా కాలంగా కొనసాగుతున్న కసరత్తు. ఇది ఒక నెల లేదా నెలన్నర పాటు జరుగుతుంది. ఈ సమయంలో పార్టీ శాసనసభ్యులు, ఎంపీలు, ఓడిపోయిన అభ్యర్థులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ(Randeep Surjewala) ముఖ్యులను కలుస్తారు. మంత్రులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని కలుస్తారు” అని అన్నారు.
Karnataka CM | హైకమాండ్పై ఖర్గే వింతైన వ్యాఖ్యలు..
మరోవైపు, ముఖ్యమంత్రి పదవికి సంబంధించి ఏదైనా నిర్ణయం పార్టీ హైకమాండ్దేనని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) సోమవారం స్పష్టం చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. హైకమాండ్ అంతర్గత చర్చలపై మిగతా ఎవరికీ అవగాహన లేదని చెప్పారు. “ఇది (నాయకత్వ మార్పు) పార్టీ హైకమాండ్(Party High Command) చేతుల్లో ఉంది. హైకమాండ్లో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అది హైకమాండ్కే వదిలివేయబడింది. తదుపరి చర్య తీసుకునే హక్కు వారికి(హైకమాండ్) ఉంది, అప్పటిదాకా ఎవరూ అనవసరంగా సమస్యలను సృష్టించకూడదు” అని ఆయన అన్నారు.