అక్షరటుడే, వెబ్డెస్క్ : Air India | అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Ahmedabad Air India plane crash) ఘటన మరువక ముందే దేశంలో పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. అహ్మదాబాద్ నుంచి లండన్ (Ahmedabad to London) వెళ్తున్న విమానం జూన్ 12న కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 270 మంది చనిపోయారు. ఈ ఘటన అనంతరం చాలా ఎయిర్ ఇండియా విమానాలు (Air India flights) సాంకేతిక సమస్యలతో రన్వేపై నిలిచిపోయాయి. ఓ ఇండిగో విమానంలో అయితే గాలిలో ఉండగానే ఇంధన కొరతను ఎదుర్కొంది. దీంతో పైలట్ చెన్నై వెళ్తున్న ఆ విమానాన్ని బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ (emergency landing) చేశారు. తాజాగా మరో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం తప్పింది.
ముంబై నుంచి చెన్నైకి (Mumbai to Chennai) వెళ్తున్న AI639 విమానం గాలిలో ఉండగా పొగలు వచ్చాయి. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే.. క్యాబిన్లో కాలిన వాసన రావడాన్ని సిబ్బంది గుర్తించారు. దీంతో వెంటనే అప్రమత్తమై విమానాన్ని ముంబైకి మళ్లించి, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులు సురక్షితంగా బయట పడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే కాలిన వాసన రావడానికి గల కారణాలపై ఇంజినీర్లు, సిబ్బంది పరిశీలిస్తున్నారు. ప్రయాణికులను మరో విమానంలో పంపించినట్లు ఎయిర్ ఇండియా (Air India) ప్రకటించింది.
Air India | ప్రయాణికుల్లో ఆందోళన
వరుస ఘటనలతో విమానాల్లో ఎక్కాలంటేనే ప్రయాణికులు భయ పడుతున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం (Ahmedabad plane crash) మిగిల్చిన విషాదాన్ని దేశం ఇంకా మరిచిపోలేదు. అంతలోనే విమానాల్లో తరుచూ సాంకేతిక లోపాలు తలెత్తుండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు సాంకేతిక కారణాలతో విమానాలను అర్ధంతరంగా ఆపేస్తుండడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముందుగానే అన్ని తనిఖీలు చేపట్టి విమాన ప్రయాణానికి అనుమతించాలని కోరుతున్నారు.