అక్షరటుడే, వెబ్డెస్క్: Gautam Adani | ఆసియాలోనే అతిపెద్ద స్లమ్ ఏరియా(Slum area) అయిన ముంబయిలోని ధారావి(Dharavi)ని దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన పట్టణ పునరాభివృద్ధి ప్రాజెక్టుగా మార్చేందుకు అదానీ గ్రూప్(Adani group) కృషి చేస్తోంది. 2025 వార్షిక సర్వసభ్య సమావేశంలో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ(Gautam Adani) ఈ విషయాన్ని తెలిపారు. ఈ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధారావి సోషల్ మిషన్ ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ, ఆరోగ్య సంరక్షణ, ఉపాధి కార్యక్రమాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 10 లక్షల మందికిపైగా ప్రజలు ఇరుకైన గల్లీల నుంచి విశాలమైన లేఅవుట్లు, డబుల్ టాయిలెట్లు, ఓపెన్ స్పేస్లు, పాఠశాలలు, ఆస్పత్రులు, ట్రాన్సిట్ హబ్లు, పార్కులతో కూడిన ఆధునిక టౌన్షిప్లోకి మారనున్నారన్నారు. అదానీ గ్రూప్ చేపట్టిన ముంబయి(Mumbai) ధారవి ప్రాజెక్ట్ ప్రజల జీవితాలను మారుస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
Gautam Adani | రూ. 3 లక్షల కోట్ల ప్రాజెక్ట్..
ముంబయిలోని ధారావి ప్రాంతం ఆసియా(Asia)లోనే అతిపెద్ద స్లమ్గా పిలవబడుతోంది. దీనిని దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పట్టణ పునరాభివృద్ధి ప్రాజెక్టుగా మార్చేందుకు అదానీ గ్రూప్ కృషి చేస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర ప్రభుత్వం(Maharashtra government) గణనీయమైన మద్దతును అందిస్తోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ధారావి పునరాభివృద్ధి ప్రాజెక్టుతో సహా మూడు ప్రాజెక్టుల కోసం రూ. 264.25 కోట్ల స్టాంప్ డ్యూటీ మినహాయింపును ప్రకటించింది. ఈ మినహాయింపు రైల్వే భూముల లీజ్ హోల్డ్పై వర్తించనుంది. అదానీ గ్రూప్ ఈ ప్రాజెక్టును నవభారత్ మెగా డెవలపర్స్(Navbharat Mega Developers) ప్రైవేట్ లిమిటెడ్ అనే స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా నిర్వహిస్తోంది.
ఇందులో అదానీ గ్రూప్ 80 శాతం వాటాను, మహారాష్ట్ర ప్రభుత్వం (స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ) 20 శాతం వాటాను కలిగి ఉంది. ఈ ప్రాజెక్టు మొత్తం 253.7 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 47.95 హెక్టార్ల భూమిని ఓపెన్ మార్కెట్లో విక్రయించడానికి అనుమతించారు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం సుమారు రూ. 3 లక్షల కోట్లు. ఈ ప్రాజెక్టులో భాగంగా ధారావిని మల్టీ మోడల్ ట్రాన్సిట్ హబ్గా అభివృద్ధి చేసేందుకు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ నోడల్ ఏజెన్సీగా నియమితమైంది. ఇందులో మెట్రో, రైలు, విమానాశ్రయం, బస్సు కనెక్టివిటీ ఏకీకరణ ఉంటాయి. ఈ ప్రాజెక్టు మొదటి దశ ఈ ఏడాది చివరి దశలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.