అక్షరటుడే, వెబ్డెస్క్ : Ashada masam | ఏటా ఆషాఢ మాసం(Ashada masam)లో వచ్చే శుక్ల పక్ష పంచమిని దక్షిణ భారతదేశంలో చాలా పవిత్రమైన తిథిగా భావిస్తారు. ఇది సుబ్రహ్మణ్య స్వామి(Subrahmanya swamy)కి సంబంధించిన విశేషమైన రోజు. కాబట్టి ఈ రోజును స్కంద పంచమి(Skanda panchami)గా జరుపుకుంటారు. దివ్య సైన్యానికి అధిపతి, దుష్ట శక్తులను అంతిమంగా జయించిన సుబ్రహ్మణ్య స్వామి దివ్య శక్తిని స్మరించుకునే పండుగ రోజు.
శివ పార్వతుల కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామిని కార్తికేయ(Kartikeya), మురుగన్, స్కంద అని కూడా పిలుస్తారు. ఆయన యుద్ధ దేవతగా, జ్ఞానం, ధైర్యానికి ప్రతీకగా పూజలందుకుంటున్నారు. భక్తులు రక్షణ, ఆరోగ్యం, వైవాహిక సామరస్యం, ఆధ్యాత్మిక పురోగతి కోసం, శత్రు బాధలు, అంతర్గత భయాలను అధిగమించడానికి, గ్రహ దోషాలు, సర్పదోషాల నివారణకు స్వామివారిని పూజిస్తారు. స్కంద పంచమి సందర్భంగా శత్రు సంహార శివ సుబ్రహ్మణ్య త్రిశతి హోమం, అభిషేకం, విభూతి సేవలు నిర్వహిస్తే విశేష ఫలితాలు ఉంటాయని భక్తులు నమ్ముతారు. ఈ సోమవారం స్కంద పంచమి సందర్భంగా ఆ సేవల గురించి తెలుసుకుందామా..
Ashada masam | సుబ్రహ్మణ్య త్రిశతి హోమం..
సుబ్రహ్మణ్య త్రిశతి (Subrahmanya trishathi) అనేది సుబ్రహ్మణ్య స్వామి యొక్క 300 నామాల పవిత్ర కలయిక. ఈ త్రిశతితో హోమం చేయడం వల్ల పలు ప్రయోజనాలుంటాయని ఆధ్యాత్మిక వేత్తలు పేర్కొంటున్నారు. సర్ప దోషాలు, కుజ దోషాలతో బాధపడుతున్నవారు ఈ హోమంలో పాల్గొనడం ద్వారా ఆయా బాధలనుంచి ఉపశమనం లభిస్తుందని, ప్రతికూల ప్రభావం తగ్గుతుందని భక్తులు నమ్ముతారు. అడ్డంకులను అధిగమించి మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలనుకునేవారు సుబ్రహ్మణ్య త్రిశతి హోమంలో పాల్గొనాలని ఆధ్యాత్మిక వేత్తలు సూచిస్తున్నారు.
Ashada masam | సుబ్రహ్మణ్య అభిషేకం
ఆషాఢ శుక్ల పంచమి రోజున సుబ్రహ్మణ్య స్వామికి (Lord Subrahmanya Swamy) పంచామృత అభిషేకం చేయడం ద్వారా విశేష ఫలితాలు ఉంటాయి. ఈ సేవతో భగవంతుడు ప్రసన్నం అవుతాడు. దంపతుల మధ్య వివాదాలు, వివాహంలో జాప్యాలు, ప్రసవ సమస్యలు తదితర సమస్యలను తొలగిపోవడానికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయాలని ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామి విభూతి ప్రియుడు. భస్మంతో అభిషేకం చేయడం, లేపనం చేయడం స్వామివారికి అత్యంత సంతృప్తినిచ్చే సేవ. ఈ సేవలో పాల్గొనడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందవచ్చు.