Site icon aksharatoday.in

Shubanshu Shukla | అంతరిక్షంలోకి దూసుకెళ్లిన శుభాంశు శుక్లా

Shubhanshu Shukla

Shubanshu Shukla | అంతరిక్షంలోకి దూసుకెళ్లిన శుభాంశు శుక్లా

అక్షరటుడే, వెబ్​డెస్క్: Shubanshu Shukla | భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి దూసుకెళ్లాడు. బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు ఫాల్కన్-9 రాకెట్(Falcon-9 rocket) ప్రయోగం ద్వారా ఆయనతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు యాక్సియం-4 మిషన్‌ ద్వారా ఐఎస్ఎస్‌కు పయనమయ్యారు. నలుగురు వ్యోమగాములతో రాకెట్​ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. గురువారం సాయంత్రం 4:30కి ఐఎస్ఎస్‌(ISS)తో వ్యోమనౌక అనుసంధానం కానుంది. కాగా.. ఈ మిషన్​ పైలట్‌గా శుభాంశు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Shubanshu Shukla | 41 ఏళ్ల తర్వాత..

భారతకు చెందిన వ్యోమగామి రాకేశ్​ శర్మ 41 ఏళ్ల క్రితం అంతరిక్షంలోకి వెళ్లారు. ఇప్పుడు తాజాగా శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు బయల్దేరారు. 28 గంటల ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి ఆయన నేతృత్వంలోని బృందం చేరుకుంటుంది. వీరు 14 రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉండనున్నారు. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడి స్పేస్​ సెంటర్(NASA Kennedy Space Center)​ నుంచి రాకెట్​ నింగిలోకి దూసుకెళ్లింది.

Shubanshu Shukla | వంద కోట్ల మంది ఆశలు తీసుకెళ్తున్నా..

అంతరిక్ష ప్రయాణానికి బయలుదేరేముందు శుభాంశు(Shubanshu Shukla) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు వంద కోట్ల మంది ఆశలు కలలు తీసుకు వెళ్తున్నానని ఆయన పేర్కొన్నారు. కాగా.. రాకెట్​ నింగిలోకి దూసుకు వెళ్లడంతో భారతీయులు హర్షం వ్యక్తం చేశారు. అయితే గతంలోనే ఆయన అంతరిక్ష యాత్రకు వెళ్లాల్సి ఉండగా.. పలుమార్లు రాకెట్​ ప్రయోగం వాయిదా పడింది. ఎట్టకేలకు బుధవారం మధ్యాహ్నం ఫాల్కన్ రాకెట్​ నింగిలోకి దూసుకు వెళ్లడంతో భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. తన కుమారుడు రోదసీ యాత్రకు వెళ్లడంపై శుభాంశు తల్లి స్పందిస్తూ ఎంతో గర్వంగా ఉందన్నారు.

Shubanshu Shukla | శుభాంశు వివరాలు..

శుభాంశు శుక్లా 1985 అక్టోబర్ 10న జన్మించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్​(Indian Air Force Group Captain)గా పనిచేస్తున్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేశారు. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదివి వైమానిక దళంలో చేరారు. సుఖోయ్-30 MKI, మిగ్-29, మిగ్-21, జాగ్వార్, హాక్ తదితర యుద్ధ విమానాలు నడిపారు. అంతేగాకుండా 2019 బాలాకోట్​ దాడుల్లో కూడా పాల్గొన్నారు. అనంతరం ఇస్రో చేపట్టే గగన్​ యాన్​ మిషన్​(Gaganyaan Mission)కోసం ఆయన వ్యోమగామిగా ఎంపికయ్యారు. ఈ క్రమంలో రష్యాలో, బెంగళూరులో శిక్షణ పొందారు. ఇందులో భాగంగా ప్రస్తుతం యాక్సియం-4 పైలట్‌గా ISSకి పయనమయ్యారు.

కాగా యాక్సియం-4 మిషన్ నాసా, ఇస్రో, స్పేస్​ ఎక్స్​, ఈసా కలిపి చేపట్టాయి. అమెరికాకు చెందిన యాక్సియం స్పేస్(Axiom Space) సంస్థ ఆధ్వర్యంలో ఈ యాత్ర చేపట్టారు. వివిధ దేశాలకు చెందిన వ్యోమగాములు అంతరిక్ష కేంద్రానికి చేరుకొని పరిశోధనలు చేస్తారు. భారత్​ నుంచి శుభాంశు శుక్లాతో పాటు అమెరికా, హంగేరీ, పోలాండ్‌కు చెందిన వ్యోమగాములు కూడా రోదసిలోకి వెళ్లారు.

Exit mobile version