Site icon aksharatoday.in

Minister Rajnath Singh | ఉగ్ర‌వాదం నుంచి ర‌క్షించుకోవ‌డం మా హ‌క్కు.. ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

Rajnath Singh

Minister Rajnath Singh | ఉగ్ర‌వాదం నుంచి ర‌క్షించుకోవ‌డం మా హ‌క్కు..ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

అక్షరటుడే, వెబ్​డెస్క్: Minister Rajnath Singh | సీమాంతర ఉగ్ర‌వాదం నుంచి త‌మ‌ను తాము ర‌క్షించుకోవ‌డానికి ఆప‌రేష‌న్ సిందూర్(Operation Sindhoor) నిర్వ‌హించ‌డం త‌మ హ‌క్కు అని భార‌త ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్ప‌ష్టం చేశారు. గురువారం చైనాలో షాంఘై కో–ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌‌సీవో) ఆయ‌న ప్ర‌సంగించారు. ఉగ్రవాద చర్యలకు ఊతమిస్తున్న పాకిస్థాన్‌(Pakistan)పై నిప్పులు చెరిగారు. కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాదాన్ని ఒక విధాన పరికరంగా మలుచుకున్నాయన్నారు.

అందులో భాగంగా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ తరహా ద్వంద విధానాలకు స్థానం లేదంటూ ఎస్‌సీవో సభ్య దేశాలకు ఆయన స్పష్టం చేశారు. “కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాదాన్ని విధాన సాధనంగా ఉపయోగిస్తాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తాయి. అలాంటి ద్వంద్వ ప్రమాణాలకు చోటు ఉండకూడదు. అటువంటి దేశాలను విమర్శించడానికి SCO వెనుకాడకూడదు” అని ఆయన అన్నారు. పాకిస్థాన్ పెంచి పోషిస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని ఖండించిన ఆయ‌న‌.. అటువంటి దేశాల చర్యలను ఏ మాత్రం ఊపేక్షించకుండా ఖండించాలని ఆయా సభ్య దేశాలకు రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) పిలుపునిచ్చారు. ఈ ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా మాట్లాడాలంటూ సభ్య దేశాల ప్రతినిధులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ నిర్వహించడం భారత్ హక్కు అని తేల్చి చెప్పారు.

Minister Rajnath Singh | ఏమాత్రం ఉపేక్షించం

పహల్గామ్ దాడి(Pahalgam attack)లో ఉగ్రవాదులు అనుసరించిన విధానం ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT) గ‌తంలో ఇండియాలో చేసిన దాడులతో సరిపోలుతుందని, భారతదేశం తనను తాను రక్షించుకోవడానికి, సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టడానికి మే 7న ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించిందని ఆయన పేర్కొన్నారు. భార‌త్‌పై దాడుల‌ను ఇక ఏమాత్రం ఉపేక్షించ‌బోమ‌ని, ఉగ్ర‌వాదుల‌తో పాటు ప్రాక్సీ సంస్థ‌ల‌ను తుద ముట్టిస్తామ‌ని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు భారత్ చర్యలు చేపట్టిందని, ఉగ్రవాద కేంద్రాలు ఏ మాత్రం సురక్షితం కాదని ఇప్పటికే తాము నిరూపించామని చెప్పారు. వాటిని లక్ష్యంగా చేసుకునేందుకు తాము ఏ మాత్రం వెనుకాడబోమన్నారు.

Minister Rajnath Singh | దాడులకు కారణం అదే..

మే 7వ తేదీన ఆపరేషన్ సింధూర్‌ను ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది.. ఆ దాడుల లక్ష్యం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటనే విషయాన్ని ఈ సందర్భంగా సభ్య దేశాలకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద సంస్థగా గుర్తించిన లష్కరే తోయిబా (ఎల్ఈటీ ) ప్రాసిక్యూట్ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్) ఈ దాడికి కారణమని, మతపరమైన గుర్తింపు ఆధారంగా బాధితుల‌ను లక్ష్యంగా చేసుకుని చంపారని రక్షణ మంత్రి అన్నారు. “ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరు చేసినా, ఏ ఉగ్రవాద చర్య అయినా నేరపూరితమైనది మరియు సమర్థించలేనిది. SCO సభ్యులు ఈ దుష్టత్వాన్ని నిస్సందేహంగా ఖండించాలి.

సరిహద్దు ఉగ్రవాదంతో సహా ఖండించదగిన ఉగ్రవాద చర్యలకు పాల్పడినవారు, నిర్వాహకులు, ఆర్థిక సహాయం అందించేవారు, స్పాన్సర్లను జవాబుదారీగా ఉంచి వారిని న్యాయం ముందు నిలబెట్టాల్సిన అవసరాన్ని మేము పునరుద్ఘాటిస్తున్నాము” అని సింగ్ అన్నారు. యువత తీవ్రవాదం వైపు వెళ్లకుండా నిరోధించేందుకు భారత్ సానుకూల చర్యలు చేపట్టిందన్నారు. భారతదేశం అధ్యక్షతన జరుగుతున్న ఈ సదస్సులో ‘ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంపై ఈ దేశాల మండలి సంయుక్త ప్రకటన విడుదల చేయడం ఈ సభ్య దేశాల ఉమ్మడి నిబద్ధతకు ప్రతీక అని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.

Exit mobile version