అక్షరటుడే, ఆర్మూర్: Armoor Former MLA | చట్టభద్రత లేని పసుపు బోర్డుకు ముచ్చటగా మూడుసార్లు ప్రారంభోత్సవాలు చేసిన ఘనత కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి దక్కిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి (BRS District President Jeevan Reddy) అన్నారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పసుపు బోర్డును పదేపదే ప్రారంభిస్తూ బీజేపీ రైతులను (Farmers) మోసగిస్తోందన్నారు. పసుపు బోర్డు నేమ్ ప్లేట్ నిజామాబాద్లో (Nizamabad) ఉందని.. కానీ ఆఫీసు కార్యాకలాపాలు ఢిల్లీలో జరుగుతున్నాయంటూ విమర్శించారు. ఇలా జరగడం వల్ల జిల్లా పసుపు రైతులకు (turmeric farmers) ఒరిగేదేమిటని ప్రశ్నించారు.
గెలిచిన ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు తెస్తానని ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind) బాండ్ పేపర్ రాసిచ్చి మరీ ప్రజలను మభ్యపెట్టారన్నారు. పదేళ్ల తరువాత కూడా రైతులు విశ్వసించే విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని జీవన్రెడ్డి విమర్శించారు. పసుపు బోర్డు స్థానంలో స్పైసెస్ బోర్డు కార్యాలయాన్ని (Spices Board office) సాధించానని ఇప్పటి వరకు చెప్పుకున్నారని గుర్తు చేశారు. పసుపు బోర్డు కంటే స్పైసెస్ బోర్డు మేలంటూ ప్రజలను మభ్యపెడుతూ వచ్చారని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పసుపు బోర్డు (Turmeric Board) కావాలని అడిగే వారంతా బుద్ధిహీనులని అర్వింద్ గతంలో అన్నారని.. ఇప్పుడు పసుపు బోర్డును తానే సాధించానని చెబుతున్నారని పేర్కొన్నారు.
అసలు బీఆర్ఎస్ (BRS) ఆధ్వర్యంలో రైతుల పోరాటం ఫలితంగానే నామమాత్రంగానైనా పసుపు బోర్డు వచ్చిందని జీవన్ రెడ్డి న్నారు. గత ఎన్నికల సమయంలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) స్వయంగా ప్రకటించారని గుర్తు చేశారు. అయితే ఏడాది గడిచాక కూడా బోర్డు స్థాపన జరగలేదని పేర్కొన్నారు. దీంతో పసుపు రైతుల్లో అసంతృప్తి చెలరేగుతున్న తరుణంలో హడావుడిగా గత జనవరి 14న పసుపు బోర్డును కేంద్ర వాణిజ్య మంత్రి పీయుష్ గోయల్ (Minister Piyush Goyal) వర్చువల్గా ప్రారంభించారన్నారు. ఇప్పుడు అదే కార్యాలయాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా మరోసారి ప్రారంభించి నవ్వులపాలయ్యారని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఒక బోర్డుకు ఎన్నిసార్లు ప్రారంభోత్సవాలు చేస్తారని ఆయన ప్రశ్నించారు.