అక్షరటుడే, వెబ్డెస్క్: Irrigation Department : తెలంగాణలో తరతరాలుగా వాయిదాలు పడుతున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలనే చిత్తశుద్ధితో పని చేయాలని నీటి పారుదల శాఖలో కొత్తగా నియామక పత్రాలు అందుకున్న ఉద్యోగులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ రైతులు ఆత్మగౌరవంతో బతకడానికి అవసరమైన నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో భాగస్వాములై ప్రజల భావోద్వేగానికి ప్రతీకలుగా నిలబడాలని కోరారు.
నీటి పారుదల శాఖలో కొత్తగా ఎంపికైన 244 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు(AEE), 199 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్స్ (JTO) లకు జలసౌధ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములవుతున్న ఉద్యోగులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
“గత నలభై యాభై ఏళ్లుగా రావలసిన నీళ్లు రాకపోగా, పూర్తి కావలసిన ప్రాజెక్టులు పూర్తి కాని కారణంగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది, వాయిదా పడుతున్న ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని సీఎం అన్నారు. నీళ్లు ఎంత అవసరమో అందుకు ఎంతగా పరితపించామో, ఏ నీటి కోసమైతే పోరాటం మొదలైంతో ఆ నీళ్లే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టాయని గుర్తుచేశారు. అందుకే నీటి పారుదల శాఖకు ప్రభుత్వం అంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లు, ప్రత్యేక తెలంగాణలో పదేళ్లు నోటిఫికేషన్ల కోసం కొట్లాడామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యం ఉద్యోగ నియామకాలని చెప్పారు. 14 నెలల్లో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ప్రైవేటు రంగంలో లక్ష ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. రూ. 3 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులను తీసుకొచ్చామన్నారు. యువతకు విద్య, ఉద్యోగాల కల్పన ప్రభుత్వ మొదటి ప్రాధాన్యమన్నారు. అడ్డంకులను అధిగమించి తొందరలోనే గ్రూప్ I, II, III, IV నియామకాలు పూర్తి చేస్తామని వివరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ జి. చిన్నారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.