అక్షరటుడే, వెబ్డెస్క్: Adilabad | ఆదిలాబాద్ జిల్లా(Adilabad district) గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హృదయాన్ని కలిచివేసే ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రెండురోజుల పసిపాపపై సీలింగ్ ఫ్యాన్ అకస్మాత్తుగా తెగిపడి పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని కొద్దుగూడ గ్రామానికి చెందిన పాయల్ అనే మహిళ రెండు రోజుల క్రితం గుడిహత్నూర్(Gudihatnur) ఆస్పత్రిలో పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లి, పాపలు ఇద్దరూ జనన విభాగంలోని బెడ్పై విశ్రాంతి తీసుకుంటుండగా, ఈ రోజు ఉదయం ఊహించని విధంగా సీలింగ్ ఫ్యాన్ ఊడిపోయి వారి మీదకు పడిపోయింది.
Adilabad | పాప సేఫ్..
ఈ ఘటనలో పసిపాప తలకు గాయాలు కాగా, వెంటనే స్పందించిన వైద్య సిబ్బంది ఆమెను తక్షణమే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ (RIMS) ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ తరహా నిర్లక్ష్యానికి స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో నిర్వహణ సరిగ్గా లేదని, కనీస భద్రతా చర్యలు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఘటనపై ఆస్పత్రి Hospital సిబ్బందిని ఉన్నతాధికారులు వివరణ కోరినట్లు సమాచారం. కాగా, ఈ ఘటన ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో నమ్మకాన్ని దిగజార్చుతోందని పలువురు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.