అక్షరటుడే, వెబ్డెస్క్: Youtuber Jyoti malhotra | దేశ రహస్యాలను పాకిస్తాన్(Pakistan)కు చేరవేస్తూ దొరికిపోయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భారత ఆర్మీ(Indian Army)కి చెందిన రహస్యాలను శత్రుదేశానికి చేరవేయడమే గాక పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలోనూ జ్యోతికి ప్రమేయం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అప్పటికే పలుమార్లు పాకిస్తాన్కు వెళ్లొచ్చిన ఆమె.. పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam Terror Attack) జరగడానికి కొన్ని నెలల ముందు ఆమె ఆ ఏరియాకు వెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇదే సమయంలో జ్యోతితో సన్నిహితంగా ఉన్న ఓ గడ్డం వ్యక్తి.. పహల్గామ్ దాడి తర్వాత కేక్ తీసుకొని పాకిస్థాన్ ఎంబసీ(Pakistan Embassy)కి వెళ్లడం హాట్ టాపిక్గా మారింది. దీంతో అసలు ఎవరీ గడ్డం వ్యక్తి, అతడికి జ్యోతికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? పహల్గామ్ అటాక్లో అతడి ప్రమేయం ఉందా..? అనే ప్రశ్నలు తలెత్తుతుతున్నాయి.
Youtuber Jyoti malhotra | నాడు ప్రశ్నిస్తున్నా పట్టించుకోకుండా..
పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన సరిగ్గా రెండ్రోజుల తర్వాత ఓ గడ్డం వ్యక్తి న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్(Pakistan High Commission)కు కేక్తో వెళ్తున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చేతిలో కేక్ పట్టుకొని, ఫోన్లో మాట్లాడుతూ ఆ వ్యక్తి పాక్ హైకమిషన్లోకి వెళ్తుండగా, మీడియా కెమెరాలు అతడ్ని క్లిక్మనిపించాయి. కేక్ ఎందుకు తీసుకెళ్తున్నారు.. బర్త్డే లేదా ఏదైనా ఫంక్షన్ ఉందా..? ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు..? అంటూ ఆ వ్యక్తిని జర్నలిస్టులు ప్రశ్నించగా, అతడు నోరు తెరువలేదు. సమాధానం చెప్పకుండా పాక్ రాయబార కార్యాలయంలోకి వెళ్లిపోయాడు.
Youtuber Jyoti malhotra | వారి ఫొటోలు వైరల్..
పాకిస్థాన్ హైకమిషన్ భవనంలోకి కేక్ తీసుకెళ్లిన వ్యక్తితో, గతంలో జ్యోతి మల్హోత్రా(Jyoti Malhotra) కలిసి దిగిన ఫొటోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పాక్ పర్యటన సమయంలో ఓ వేడుకలో జ్యోతి స్వయంగా తీసిన వీడియోలో ఈ గడ్డం వ్యక్తి కూడా ఉండడం గమనార్హం. దీంతో సదరు వ్యక్తి ఎవరు..? పాక్ రాయబార కార్యాలయంలోకి అతడు ఎందుకు వెళ్లాడు..? పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam Terror Attack) ప్లానింగ్లో అతడి పాత్ర ఉందా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు వారిద్దరు ఎక్కడ కలుసుకున్నారు ? వారిద్దరికి ఉన్న సంబంధం ఏమిటి ? ఉగ్రదాడి వెనుక వారి పాత్ర ఏమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
Youtuber Jyoti | పాక్, చైనాలకు వెళ్లిన జ్యోతి..
గూఢచర్య ఆరోపణలతో అరెస్టు అయిన జ్యోతి(Jyothi).. పహల్గామ్ దాడికి ముందు పలుమార్లు పాక్లో పర్యటించిందని, అలాగే చైనాకూ వెళ్లొచ్చిందని పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయంలోని అధికారి డానిష్(Officer Danish)తో ఆమె టచ్లో ఉన్నట్లు నిర్ధారించారు. జ్యోతిని డానిష్ ట్రాప్ చేసినట్లు గుర్తించారు. ఇదే తరుణంలో గడ్డం వ్యక్తితో జ్యోతి ఉన్న వీడియో, అతడు కేక్తో పాక్ రాయబార కార్యాలయానికి వెళ్తున్న వీడియోలు బయటకు రావడంతో అతడు ఎవరు..? డానిష్తో అతడికి ఉన్న సంబంధం ఏంటి..? జ్యోతిని ట్రాప్ చేయడంలో అతడి పాత్ర ఎంత? పహల్గామ్ దాడిలో అతడి రోల్ ఉందా.. వంటి ప్రశ్నలు ఇప్పుడు రేకెత్తుతున్నాయి. ఆయా అంశాలపై పోలీసులు(Police) ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు.
Youtuber Jyoti malhotra | పాక్లోనే కలిసిన ఇద్దరు..
పాకిస్తాన్ ఐఎస్ఐ(Pakistan ISI)తో జ్యోతికి నేరుగా సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన రెండు రోజుల తర్వాత న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్కు కేక్ తీసుకెళ్లిన వ్యక్తిని జ్యోతి పాకిస్తాన్లోనే కలిసినట్లు అనుమానిస్తున్నారు. పాకిస్తాన్ పర్యటన సందర్భంగా జ్యోతి తాను హాజరైన పార్టీలో తీసిన వీడియోలో సదరు గడ్డం వ్యక్తి అందులో కనిపించడంతో వారికి ముందే పరిచయం ఉంటుందని భావిస్తున్నారు. జ్యోతి ఢిల్లీలో పాకిస్తానీ అధికారి అహ్సాన్-ఉర్-రహీమ్(Pakistani officer Ahsan-ur-Rahim)ను కలిసిందని, రెండుసార్లు పాకిస్తాన్కు వెళ్లిందని, సున్నితమైన సమాచారాన్ని పంచుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐఎస్ఐకి ఆస్తి(అసెట్)గా మారిన జ్యోతి మల్హోత్రా మరికొంత మంది ఇన్ఫ్లుయెన్సర్స్ను ఇందులోకి దించేందుకు యత్నించిందని హర్యానా పోలీసులు వెల్లడించారు.