అక్షరటుడే, వెబ్డెస్క్: Banakacherla | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం షాక్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం ప్రాతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్ట్ (Banakacherla Project)కు అనుమతి నిరాకరించింది. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కేంద్ర నిపుణుల కమిటీ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి (Godavari), కృష్ణా (Krishna) నదుల అనుసంధానం కోసం బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మించాలని నిర్ణయించింది. గోదావరి జలాలను ఎత్తిపోతలు, గ్రావిటీ కెనాల్స్ ద్వారా పొలవరం నుంచి శ్రీశైలం కుడి కాలువలోని బనకచర్ల హెడ్ రెగ్యూలేటర్ వద్దకు నీటిని తరలించాలని యోచించింది. అయితే ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ క్రమంలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లి బనకచర్లకు అనుమతి ఇవ్వొద్దని కేంద్ర జల శక్తి మంత్రిని కలిసి విన్నవించారు.
Banakacherla | నిపుణుల కమిటీ ఏమందంటే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్ట్కు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసింది. దీనిపై తాజాగా కేంద్ర నిపుణుల కమిటీ స్పందించింది. బనకచర్ల ప్రాజెక్ట్కు అనుమతి (Permission) ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఆ ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వచ్చాయని నిపుణుల కమిటీ పేర్కొంది. అనుమతుల కోసం గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యున్ అవార్డును పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. పర్యావరణ అనుమతుల కోసం CWC పరిశీలించాలని తెలిపింది.
Banakacherla | హర్షం వ్యక్తం చేసిన కవిత
బనకచర్ల ప్రాజెక్టకు అనుమతి నిరాకరణపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఎక్స్ వేదికగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 200 టీఎంసీలకు పైగా గోదావరి జలాలను పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా, పెన్నా బేసిన్ లకు తరలించేందుకు చేపట్టిన గోదావరి – బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు నిరాకరించడం హర్షణీయమన్నారు. ఎక్స్ పర్ట్ అప్రైజల్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం తెలంగాణ జాగృతి (Telangana Jagruthi), బీఆర్ఎస్ (BRS) సాధించిన విజయమని ఆమె పేర్కొన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబుతో చేతులు కలిపి తెలంగాణ జలదోపిడీకి ద్వారాలు తెరిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇకనైనా తెలంగాణ ప్రయోజనాల కోసం పని చేయాలని ఆమె అన్నారు. గోదావరి – బనకచర్ల ప్రాజెక్టుపై వెంటనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలన్నారు.