అక్షరటుడే, న్యూఢిల్లీ: Supreme Court : లైంగిక వేధింపుల కేసు(sexual harassment case)లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్(social media influencer)కు సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది. ఈ కేసులో విచారణ చేపట్టిన జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఆ మహిళ “చిన్నపిల్ల ఏం కాదు” ఒక చేతితో చప్పట్లు మోగవు అని పేర్కొంది. “మీరు ఏ ప్రాతిపదికన ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేశారు..? ఆమె చిన్నపిల్లేమీ కాదు. ఆ మహిళ వయసు 40 ఏళ్లు. వారు కలిసే జమ్మూకు వెళ్లారు. మీరు ఈ కేసు ఎందుకు పెట్టారు. ఈమె జమ్మూ(Jammu)కు ఏడుసార్లు వెళ్లినా తన భర్తకు పట్టింపు ఉండదా?” అని ధర్మాసనం ప్రశ్నించింది.
ఈ కేసులో నిందితుడు తొమ్మిది నెలలుగా జైలులో ఉన్నాడని, అభియోగాలు మోపలేనందున ఇది మధ్యంతర బెయిలు ఇవ్వడానికి తగిన కేసు అని వ్యాఖ్యానించింది. నిందితుడిపైన కూడా ధర్మాసనం విమర్శలు గుప్పించింది. ఇలాంటి వ్యక్తుల వల్ల ఎవరు ప్రభావితమవుతారని ప్రశ్నించింది. నిందితుడిని ట్రయల్ కోర్టు ఎదుట హాజరుపరచాలని.. నిబంధనలు, షరతులకు లోబడి బెయిలు మంజూరు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. నిందితుడు తన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదని స్పష్టం చేసింది. బాధిత మహిళను సంప్రదించడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రయత్నించకూడదని హెచ్చరించింది.
Supreme Court : అసలేం జరిగిందంటే..
పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం.. ఓ మహిళ తన వస్త్రాల బ్రాండ్ (clothing brand) కోసం 2021లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సహాయం కోరింది. అలా వారి పరిచయం ఏర్పడింది. కంటెంట్ కోసం ఐఫోన్ ఇవ్వాలని మహిళను నిందితుడు కోరగా.. ఆమె జమ్మూలోని అధీకృత ఆపిల్ స్టోర్(authorized Apple store) లో మొబైల్ కొనుగోలు చేసి అతడికి ఇచ్చింది.
కాగా, నిందితుడు తన పరికరాన్ని తిరిగి అమ్మడానికి ప్రయత్నించాక, వారి మధ్య సంబంధం బెడిసికొట్టింది. దీంతో, ఆమెకు అతడు డబ్బులు తిరిగి ఇచ్చేశాడు. కానీ, రూ.20 వేలు తక్కువగా చెల్లించాడు. కాగా, డిసెంబరు 2021లో, ఆ వ్యక్తి రూ. 20 వేలు తిరిగిచ్చేసి క్షమాపణ చెబుతానని నోయిడాలోని ఆమె ఇంటికి వెళ్లాడు.
తదుపరి కన్నాట్ ప్లేస్లో(Connaught Place) జరిగే బ్రాండ్ షూట్ కోసం రమ్మని ఆమెను బలవంతంగా ఒప్పించాడు. దారిలో తనకు నిందితుడు మత్తు పదార్థాలు కలిపిన స్వీట్లు ఇవ్వడంతో స్పృహ కోల్పోయినట్లు మహిళ ఆరోపించింది. ఆస్పత్రికి అని చెప్పి, ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. దీనికితోడు పర్సు, డబ్బు దొంగిలించి, అసభ్యకర చిత్రాలు తీశాడనేది బాధితురాలి ఆరోపణ.
అనంతరం, జమ్మూకు తీసుకెళ్లి బలవంతం చేశాడని, అక్కడ రెండున్నర సంవత్సరాలుగా లైంగిక వేధింపులు, దోపిడీకి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో వివరించింది. ఈమేరకు అతడిపై కేసు నమోదు అయింది.