అక్షరటుడే, వెబ్డెస్క్ : Rayachoti | అన్నమయ్య (Annamayya) జిల్లా రాయచోటి (Rayachoti)లో ఇద్దరు ఉగ్రవాదులను తమిళనాడు (Tamil Nadu) పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తమ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే విషయం తెలియడంతో స్థానికంగా కలకలం రేగింది. కొన్నాళ్లుగా స్థానికంగా ఉంటూ వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యక్తులు టెర్రరిస్టులని తెలియడంతో ప్రజలు షాక్ అయ్యారు.
Rayachoti | భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
రాయచోటిలో అబూబకర్ సిద్ధిఖీ, మహ్మద్ అలీ అనే ఉగ్రవాదులను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో స్థానిక పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా తనిఖీలు చేయగా.. నిందితుల ఇళ్లలో భారీగా పేలుడు పదార్థాలు లభ్యం కావడం గమనార్హం. రాయచోటిలో ఉగ్రవాద స్థావరాలపై కర్నూలు డీఐజీ ప్రవీణ్ (Kurnool DIG Praveen) వివరాలు వెల్లడించారు. నిందితులు అల్ ఉమ్మా అనే సంస్థకు చెందిన టెర్రరిస్టులని పేర్కొన్నారు. దేశంలోని మూడు ప్రధాన నగరాల్లో బాంబ్ బ్లాస్ట్ చేయాలని వీరు కుట్ర పన్నినట్లు ఆయన తెలిపారు. ఐఈడీలు తయారు చేసే సామగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
Rayachoti | కొనసాగుతున్న విచారణ
పలు బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితులుగా ఉన్న సిద్దిఖీ, అలీ రాయచోటిలో రహస్య జీవితం గడుపుతున్నారు. సిద్దిఖీ స్థానికంగా దుస్తుల దుకాణం, అలీ కిరాణ షాపు నడుపుతూ జీవిస్తున్నారు. అలాగే స్థానికంగా ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారి వివరాలు సేకరిస్తున్నట్లు డీఐజీ తెలిపారు. 2013లో బెంగళూరు (Bengaluru)లోని మల్లేశ్వరంలో జరిగిన పేలుళ్లలో ఈ ఇద్దరు నిందితుల పాత్ర ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుల భార్యలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వారిని కోర్టులో హాజరు పర్చగా జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు.