అక్షరటుడే, బాన్సువాడ: Banswada | వృద్ధాప్య పింఛన్ల కోసం పలువురికి తిప్పలు తప్పట్లేదు. క్షేత్రస్థాయిలో సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు లబ్ధిదారుల పాలిట శాపంలా మారుతోంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ (Banswada municipality) పరిధిలో వృద్ధులు, వితంతు, వికలాంగులకు పింఛన్లు పంపిణీ చేసే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నెలనెలా అందించే పించన్లను కేవలం మూడు, నాలుగు రోజులు మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు.
ఈ విషయమై సబ్ కలెక్టర్ కిరణ్మయికి (Sub-Collector Kiranmayi) శుక్రవారం వినతిపత్రం అందజేశారు. పింఛన్ పంపిణీ గడువును 10 రోజులకు పొడిగించాలని కోరారు. మున్సిపాలిటీ పరిధిలో 4,886 మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నారని, నెలలో కేవలం మూడు రోజులు మాత్రమే పంపిణీ చేస్తే.. 50 శాతం మందికి కూడా డబ్బులు అందడంలేదని పేర్కొన్నారు. వినతిపత్రం అందించిన వారిలో మొచి గణేష్, శివ సూరి, మహేష్, గాండ్ల కృష్ణ, సాయిలు, మౌలా, అనిల్, రాము, గోపి తదితరులు పాల్గొన్నారు.