అక్షరటుడే, వెబ్డెస్క్ : Rythu Bharosa | రాష్ట్రంలో అన్నదాతల (Farmers) పెట్టుబడి సాయం కింద రైతు భరోసా (Rythu Bharosa) జమ కొనసాగుతోంది. వానాకాలం సాగు సీజన్కు సంబంధించి రైతు భరోసా నిధుల విడుదలను సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) సోమవారం ప్రారంభించిన విషయం తెలిసిందే.
తొలి రోజు రెండు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులు ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేసింది. రెండో రోజు మూడు ఎకరాల్లో భూమి ఉన్న అన్నదాతలకు డబ్బులు వేసింది. తాజాగా బుధవారం నాలుగు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Tummala Nageswara Rao) తెలిపారు.
నాలుగు ఎకరాల విస్తీర్ణం వరకు రైతుభరోసా నిధులు జమ కోసం ప్రభుత్వం మరో రూ.1,313.53 కోట్లు విడుదల చేసింది. 21.89 లక్షల ఎకరాలకు సంబంధించి 6.33 లక్షల మంది రైతుల ఖాతాల్లో బుధవారం డబ్బులు జమ చేసినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఇప్పటి వరకు 58.04 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.5215.26 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. ఈ సీజన్లో రైతుభరోసా కింద రూ.9 వేల కోట్లు తొమ్మిది రోజుల్లో జమ చేస్తామని ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే.
Rythu Bharosa | వారికి ప్రశ్నించే హక్కు లేదు
రైతు భరోసా విషయంతో తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు బీఆర్ఎస్ (BRS leaders) నాయకులకు లేదని మంత్రి తుమ్మల అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్కసారి మినహా ఎప్పుడు కూడా సకాలంలో రైతుబంధు (Rythu Bandhu) విడుదల చేయలేదని ఆయన విమర్శించారు. ప్రతిసారి ఆలస్యంగా డబ్బులు జమ చేసేవారన్నారు. కానీ, తమ ప్రభుత్వం మాత్రం సాగు పనులు మొదలు కాకముందే అన్నదాతల ఖాతాల్లో రైతు భరోసా జమ చేస్తున్నట్లు తెలిపారు.