అక్షరటుడే, ఇందూరు: RSS Indur | శివాజీ జీవితమే ఆదర్శమని.. ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని పిల్లలను పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్ర కార్యదర్శి (Vidya Bharati South Central Zone Secretary) అయాచితుల లక్ష్మణరావు అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) నగర శాఖ ఆధ్వర్యంలో ఆదివారం హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురువుల మార్గదర్శనంలో ప్రతి యుగంలో మహనీయులు ఉద్భవించారని గుర్తు చేశారు. విశ్వామిత్రుడు (Vishwamitrudu) వశిష్టుడు కలిసి శ్రీరాముడిని, సాందీపని మహర్షి శ్రీకృష్ణుడిని, సమర్థ రామదాసు శివాజీ మహారాజుని తయారు చేశారన్నారు. అందుకే హిందూ సంస్కృతిలో ఆచార్య పరంపరకు ఎంతో విలువ ఉందన్నారు.
శివాజీ(Shivaji) జీవితం ఆదర్శంతో కూడినదని, బాల్యం నుంచే ధర్మ పరిరక్షణ.. హిందూ సామ్రాజ్యం నిర్మాణం అనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగాడని వివరించారు. అలాంటి కొడుకును తీర్చిదిద్దిన తల్లి జిజియా మాత అందరికీ ఆదర్శమన్నారు. హిందూ ధర్మం సనాతనమైనదని హిందుత్వాన్ని వేరే మతాలతో పోల్చడం మూర్ఖత్వం అన్నారు.
ముఖ్య అతిథిగా హాజరైన ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్ (SBI Deputy Manager) ఠాకూర్ సందీప్సింగ్ మాట్లాడుతూ.. 1925లో నాగపూర్లో (Nagpur) కేవలం ఆరుగురితో ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ ఖండాంతరాలు దాటి ప్రపంచంలోనే విశాలమైన సామాజిక సంస్థగా ఎదగడం ఆదర్శమన్నారు. జాతీయ భావన సేవా తత్వంతో ముందుకు సాగుతుందన్నారు.
బోర్గాం(పి)లో శివాజీ విగ్రహావిష్కరణ..

నగర శివారులోని బోర్గాం(పి) (Borgaon (P)) చౌరస్తాలో చత్రపతి శివాజీ సేవా సమితి (Chhatrapati Shivaji Seva Samiti) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విగ్రహావిష్కరణలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాతో (Urban MLA Dhanpal Suryanarayana Guptha) కలిసి లక్ష్మణరావు పాల్గొన్నారు. నగర స్వాగత తోరణ ప్రాంతంలో శివాజీ విగ్రహాన్ని ప్రతిష్టించడం శుభసూచకంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం స్వయం సేవకుల ఘోష్ ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నగర కార్యవాహ అర్గుల సత్యం, సహకార్యవాహలు సుమిత్ కుమార్, వెంకటేష్, శివాజీ సేవాసమితి అధ్యక్షుడు లక్ష్మణరావు, కోశాధికారి గజానంద్, దినేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
