అక్షరటుడే, వెబ్డెస్క్: Cyber Crime : రాజస్థాన్(Rajasthan)లో రూ. 2 వేల కోట్ల సైబర్ మోసం కలకలం రేపింది. ప్రధాన నిందితుడు కృష్ణశర్మ అరెస్టుతో దేశవ్యాప్తంగా ఈ సైబర్ మోసం డొంక కదిలింది. రాజస్థాన్ పోలీసు బృందం సాంకేతిక ఆధారాలతో కృష్ణశర్మ సైబర్ గ్యాంగ్ క్రైం గుట్టురట్టు చేసింది.
ఏడు రాష్ట్రాల్లో రూ.2 వేల కోట్లకు పైగా మోసం చేసిన అతి పెద్ద అంతర్జాతీయ సైబర్ క్రైం ముఠా కార్యకలాపాలను రాజస్థాన్ రాజధాని జైపూర్(Jaipur)లోని సైబర్ ఠాణా పోలీసులు బట్టబయలు చేశారు. నేపాల్, దుబాయ్లలోని కింగ్పిన్ల ఆదేశాల మేరకు ఈ ముఠా భారత్లో నకిలీ బ్యాంకు ఖాతాలను తెరిచి చైనా సైబర్ క్రైం ముఠాకు విక్రయించింది. పోలీసులు అరెస్టు చేసిన నిందితులలో ఢిల్లీ నివాసి పవన్ జైన్, అబ్దుల్ షామా, నేపాల్ నివాసి లాల్ డోర్జే తమాంగ్, సుజల్ తమాంగ్ ఉన్నారు.
రాజస్థాన్లోని కొందరు కేటుగాళ్లు దేశవ్యాప్తంగా సైబర్ మోసాలకు పాల్పడుతూ భారీ మొత్తంలో డబ్బులు దోచుకుంటున్నట్లు శ్రీగంగానగర్ (Sri Ganganagar) పోలీసులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన పోలీసులు.. పక్కా ప్రణాళికతో కేటుగాళ్లను పట్టుకున్నారు. బికనీర్ జిల్లా నపసర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఖర్దాలో నిందితుడు కృష్ణశర్మను అదుపులోకి తీసుకున్నారు.
Cyber Crime : ఒక్కడి ఖాతాలోనే వంద కోట్ల లావాదేవీలు..
కృష్ణశర్మ బ్యాంకు ఖాతాలో రూ.99.65 కోట్ల లావాదేవీల రికార్డును చూసి పోలీసులు అవాక్కయ్యారు. అతడి గ్యాంగ్ దేశంలోని వేలాది మందిని మోసగించి రూ. వేల కోట్లు కాజేసినట్లు తేల్చారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని సైబర్ మోసాలు ఈ కేసుతో వెలుగులోకి వచ్చాయి. తెలంగాణ Telangana, గుజరాత్ Gujarat, కర్ణాటక Karnataka, మహారాష్ట్ర Maharashtra, ఉత్తరప్రదేశ్ Uttar Pradesh, తమిళనాడు Tamil Nadu, పశ్చిమబెంగాల్ West Bengal తదితర రాష్ట్రాల్లో సైబర్ రాకెట్ యాక్టివ్గా ఉన్నట్లు తేలింది.
శ్రీ గంగానగర్ ఎస్పీ గౌరవ్యాదవ్ కేసు వివరాలు వెల్లడించారు. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్, నకిలీ పెట్టుబడి పథకాలు, ఫేక్ లక్కీ డ్రాల పేరుతో వాట్సప్ కాల్స్, సోషల్ మీడియా, నకిలీ వెబ్సైట్ల ద్వారా ప్రజలను ఆకర్షించి.. మోసాలు చేస్తున్నట్లు తేలిందన్నారు. ఈ కేసులో కొన్ని ప్రైవేటు బ్యాంకుల ఉద్యోగుల పాత్రపైనా అనుమానాస్పదంగా ఉండటంతో ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ చెప్పారు.
Cyber Crime : చైనా ముఠాతో సంబంధం..!
పోలీసుల విచారణలో కీలక సూత్రధారి లాల్ డోర్జే టెలిగ్రామ్, ఇంటర్నెట్ ద్వారా చైనీస్ ముఠాతో నేరుగా సంబంధం కలిగి ఉన్నట్లు నిర్ధారించారు. దుబాయ్లో ఉంటున్న సుష్మ అనే మహిళతో సంప్రదింపులు జరపగా.. ఆమె చైనీస్ దుండగులకు బ్యాంకు ఖాతాలు, సిమ్ కార్డు, ఈమెయిల్ ఐడీలను అందించిందని తేలింది. ఈ ముఠా ఒక్కొక్క ఖాతాను రూ.5 లక్షలకు విక్రయించేది. గేమింగ్, ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో ఈ ఖాతాల ద్వారా చైనా నుంచి నగదు బదిలీ చేశారు. ఇందులో నిందితుడు ప్రతి లావాదేవీకి 2.5 నుంచి 5 శాతం వరకు కమీషన్ తీసుకునేవాడు. అదీనూ USDT వంటి క్రిప్టోకరెన్సీ cryptocurrencies లలో కమీషన్ తీసుకున్నట్లు తేలింది.
Cyber Crime : కొంప ముంచే ఏపీకే యాప్..
సుజల్ తమంగ్ పని ఖాతాదారులను పర్యవేక్షించడం, వారి సెల్ఫోన్లలో APK యాప్ను ఇన్స్టాల్ చేయడం. ఏపీకే అనేది ఇది ఒక గూఢచారి యాప్.. దీని ద్వారా చైనీస్ దుండగులకు ఖాతాల పూర్తి యాక్సెస్ లభించేది. ఒక హోటల్లో సుజల్ తన మొబైల్ను ఉంచి నేపాల్లోని లాల్ డోర్జేకు యాక్సెస్ను అందించేవాడు. ఈ ముఠా సభ్యులు దేశవ్యాప్తంగా బ్యాంకు ఖాతాల కోసం వెతికేవారు. కమీషన్ ఇస్తామని ప్రజలను ఆకర్షించి, వారి ఫోన్లలో APKను ఇన్స్టాల్ చేసేవారు. ఇలా లావాదేవీలన్నీ డిజిటల్, ఎన్క్రిప్టెడ్ ద్వారా జరిగేవి.
ఈ ముఠా సభ్యులు సైబర్ మోసానికి పాల్పడినట్లు తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు సహా ఏడు రాష్ట్రాల్లో ఫిర్యాదులు అందాయి. సమాచారం అందిన వెంటనే ఆర్పీఎస్ అధికారి సోంచంద్ వర్మ ఆధ్వర్యంలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై ఐటీ చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.