అక్షరటుడే, వెబ్డెస్క్: National Herald case | కాంగ్రెస్ పార్టీకి ఊహించని రీతిలో షాక్ తగిలింది. నేషనల్ హెరాల్డ్ కేసు(National Herald case)లో మనీ లాండరింగ్(Money Laundering) వ్యవహారంలో ఆ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court) శుక్రవారం నోటీసులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్(National Herald) పత్రిక వ్యవహారంలో భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) దాఖలు చేసిన కేసులో వీరిద్దరికీ కోర్టు ఈ నోటీసులు పంపింది. ఈడీ ఛార్జిషీట్కు సమాధానం ఇవ్వాలని కోర్టు రాహుల్గాంధీ, సోనియాగాంధీకి జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణ మే 7వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఈడీ ఇటీవల దాఖలు చేసిన ఛార్జిషీట్ విచారణ సమయంలో ప్రతివాదుల వాదనలు వింటామని ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే స్పష్టం చేశారు.
National Herald case | ఈడీ సూచన మేరకు..
నేషనల్ హెరాల్డ్ కేసులో అక్రమాలు జరిగాయని బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి 2014లో దాఖలు చేసిన క్రిమినల్ ఫిర్యాదును మేజిస్ట్రేట్ కోర్టు స్వీకరించింది. ఆ తర్వాత ఈ కేసులో 2021లో ఈడీ దర్యాప్తు అధికారికంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. విచారణ జరిపిన ఈడీ.. ఇటీవల ఛార్జిషీట్ దాఖలు చేసింది. అయితే, కొత్త చట్టం ప్రకారం నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో నిందితులను విచారించకుండా ఛార్జిషీట్ను పరిగణనలోకి తీసుకోలేమని.. ఈ నేపథ్యంలో విచారణకు హాజరయ్యేలా వారికి నోటీసులు ఇవ్వాలని ఈడీ ఇటీవల ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. గతవారం ఈ కేసును విచారించిన న్యాయస్థానం ఈడీ సమర్పించిన ఛార్జిషీట్లో సరైన పత్రాలు లేని కారణంగా సోనియా, రాహుల్కు నోటీసులు ఇచ్చేందుకు రౌస్ ఎవెన్యూ కోర్టు నిరాకరించింది. తాజాగా శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.