అక్షరటుడే, వెబ్డెస్క్: Rohith – Kohli | టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ (Rohith Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli)లు కొద్ది రోజుల గ్యాప్తోనే టెస్ట్ క్రికెట్ నుంచి అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇద్దరు అంతక ముందు టీ20 ఫార్మాట్కి గుడ్ బై చెప్పగా అనంతరం సుదీర్ఘ ఫార్మాట్కి వీడ్కోలు పలికారు. దీంతో అభిమానులు చాలా నిరాశ చెందారు.
వీరిద్దరూ గతేడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన వెంటనే పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్కే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో 2027 వన్డే వరల్డ్ కప్కు వీరిద్దరూ అందుబాటులో ఉంటారా లేదా అనే ప్రశ్నలు మళ్లీ తెరపైకి వచ్చాయి. అయితే, ఈ అంశంపై BCCI ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక ప్రకటన చేశారు.
Rohith – Kohli | వరల్డ్ కప్ ఆడతారు..
విరాట్, రోహిత్ 2027 వరల్డ్ కప్ (2027 World Cup) వరకు ఆడతారు అని రాజీవ్ శుక్లా (Rajiv Sukhla) చెప్పుకొచ్చారు. లండన్లో మీడియాతో మాట్లాడిన రాజీవ్ శుక్లా.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్లో ఇంకా కొన్నేళ్లు కొనసాగించాలనుకుంటున్నారు. వారు 2027 వరల్డ్ కప్ కోసం అందుబాటులో ఉంటారు. ప్రస్తుతం వారు టెస్ట్, టీ20లకు దూరంగా ఉన్నారు. అయితే రిటైర్మెంట్ ఒక ఆటగాడి వ్యక్తిగత నిర్ణయం. BCCI ఏ ఫార్మాట్లోనైనా రిటైర్మెంట్ ప్రకటించమని చెప్పదు. ఇది పూర్తిగా వారి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది అని అన్నారు.
ఇక విరాట్, రోహిత్లు టెస్ట్లకు దూరమైన తర్వాత భారత్ ఇంగ్లాండ్ పర్యటనకు శుభ్మన్ గిల్(Shubhman Gill) నాయకత్వంలో యువతతో కూడిన జట్టును పంపింది బీసీసీఐ. యువ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ, సీనియర్ ఆటగాళ్లని మిస్ అవుతున్నామన్న అనుభూతి అభిమానుల్లో ఉంది. మూడో టెస్టులో భారత్ ఓడిపోవడంతో రోహిత్, కోహ్లీ ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని కొందరు కామెంట్స్ చేశారు.
ఇక విరాట్ కోహ్లీ కెరీర్ విషయానికి వస్తే వన్డేలలో 302 మ్యాచ్లు, 14,181 పరుగులు, 51 సెంచరీలు చేశాడు. వన్డేల్లో ప్రపంచ అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా కూడా నిలిచాడు. ఇక రోహిత్ శర్మ కెరీర్ చూస్తే.. వన్డేలలో 273 మ్యాచ్లు, 11,168 పరుగులు, 3 డబుల్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264) రికార్డు సృష్టించిన ఆటగాడిగా రోహిత్ పేరు టాప్లో ఉంది. అలానే 2024 T20 వరల్డ్ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా ఇండియాను నిలిపిన కెప్టెన్ గా కూడా రికార్డులు సృష్టించాడు రోహిత్.