అక్షరటుడే, వెబ్డెస్క్: Phone Tapping Case | రాష్ట్రంలో దుమారం రేపిన ఫోన్ ట్యాపింగ్ అంశంపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రధాన నిందితుడు, అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకరరావు(SIB Chief Prabhakar Rao) అమెరికా నుంచి తిరిగి వచ్చి విచారణకు హాజరు కావడంతో అందరి దృష్టి ప్రస్తుతం దీనిపైనే నెలకొంది. ఇలాంటి తరుణంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీనియర్ కాంగ్రెస్ నేత బక్క జడ్సన్(Senior Congress leader Bakka Judson) సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) పక్కన ఉన్నోళ్లే ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారని వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్లో 4 లక్షల సిమ్లు కొనుగోళ్లు చేశారని, దీని వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఓఎస్డీ చంద్రశేఖర్రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు.
Phone Tapping Case | అప్రమత్తమైన రేవంత్ బృందం..
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తాను పోలీసుల దృష్టికి తీసుకురావడంతో రేవంత్ బృందం అప్రమత్తమైందని జడ్సన్ తెలిపారు. పోలీసు కమిషనర్(Police Commissioner) ఆఫీసుకు వెళ్లి 4 లక్షల సిమ్ల వ్యవహారాన్ని తాను బయటపెట్టడంతో.. ట్యాపింగ్ కేసు తిరిగి తమకే చుట్టుకునే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి బృందం అలర్ట్ అయిందని చెప్పారు. అందుకే, తనకు నోటీసులు జారీ చేశారని తెలిపారు. తమకు విరుద్ధంగా మాట్లాడుతున్నాడని పేర్కొంటూ.. కాంగ్రెస్ పార్టీకి 34 ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలు అందించిన దళిత నాయకుడైన తనకు షోకాజ్ నోటీసులు(Show Cause Notices) జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తానేం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. అసలు పార్టీ లైన్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదే రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. ‘రాహుల్కు మోదీ(PM Modi) శత్రువు, పార్టీ బ్యాంకు ఖాతాలన్నీ మోదీ సీజ్ చేసిండు. అలాంటి మోదీని పట్టుకుని బడా భాయ్ అని అన్నది రేవంత్ రెడ్డియే కదా..? అది కదా పార్టీకి వ్యతిరేకమంటే ? వీటన్నింటికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని’ జడ్సన్ డిమాండ్ చేశారు.