అక్షరటుడే, వెబ్డెస్క్: Assam CM Himanta | అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సోమవారం సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్(Congress MP Gaurav Gogoi) పాకిస్తాన్ పర్యటన గురించి తాను చేసిన ఆరోపణల్లో తప్పుందని రుజువు చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ(ISI) ఆహ్వానం మేరకు కాంగ్రెస్ ఎంపీ శత్రు దేశంలో పర్యటించారని, పాకిస్తాన్ నిఘా సంస్థతో కలిసి పనిచేశారని హిమంత(Himanta) ఆదివారం తీవ్ర ఆరోపణలు చేశారు. గౌరవ్ గొగోయ్ ఐఎస్ఐ, పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు పాకిస్తాన్ సందర్శించారని శర్మ ఆరోపించారు. పాకిస్తాన్(Pakistan) నుంచి తిరిగి వచ్చిన తర్వాత గొగోయ్ రాఫెల్ జెట్ల కొనుగోలును వ్యతిరేకించారని, భారత రక్షణ మోహరింపులపై సమాచారం కోరారని, పార్లమెంటుతో సహా దేశంలో అణ్వాయుధాలు, దాని నిల్వ గురించి విచారించారని శర్మ ఆరోపించారు. తాజాగా తన ఆరోపణలకు కట్టుబడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Assam CM Himanta | రాజీనామాకు సిద్ధం
తాను చెప్పినదాంట్లో ఏ ఒక్కటి అసత్యమని రుజువు చేసినా ముఖ్యమంత్రి(Chief Minister) పదవికి రాజీనామా చేస్తానని హిమంత ప్రకటించారు. “నా ఒక్క మాట కూడా తప్పు అని రుజువైతే, నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాను” అని శర్మ స్పష్టం చేశారు. “హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా చేసిన నేరం కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్(MP Gaurav Gogoi) చేసిన దానితో పోలిస్తే పెద్దగా తేడా లేదు. గొగోయ్ చేసినది గూఢచర్యం కాకపోతే మరేమిటి?” అని ఆయన ప్రశ్నించారు. గోగోయ్ పాకిస్తాన్ పర్యటన కేవలం దౌత్య పర్యటన కాదని, పాకిస్తాన్ రాష్ట్ర యంత్రాంగంతో ముడిపడి ఉన్న వ్యూహాత్మక చర్య అని ఆరోపించారు. గొగోయ్ పర్యటనకు సంబంధించి ఆధారాలు సేకరిస్తున్నామని, త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు. “ఇది చిన్న విషయం కాదు. చట్టబద్ధంగా ఆమోదయోగ్యమైన విశ్వసనీయ సమాచారం, రుజువులు మా వద్ద ఉన్నాయి. పూర్తి ఆధారాలు వచ్చాక చర్యలు తీసుకుంటామని” శర్మ చెప్పారు. ప్రస్తుతం కోర్టు ఆమోదయోగ్యమైన రుజువులను పొందడంలో సిట్(Sit) పని చేస్తుందన్నారు. “రాయబార కార్యాలయాలు(Embassies) ఇప్పటికే అవసరమైన వివరాలను అందిస్తున్నాయి. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత తిరస్కరించలేని ఆధారాలను సమర్పించడానికి సిద్ధంగా ఉన్నామని” చెప్పారు.