అక్షరటుడే, ఇందూరు: RTC Retired Employees | ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు చికిత్స పొందాలంటే గతంలో అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చేది. సాంకేతిక ఇబ్బందుల కారణంగా హైదరాబాద్కు వెళ్లాల్సి వచ్చేది. ఇక నుంచి ఈ సమస్య తప్పింది. విశ్రాంత ఉద్యోగులు ఇప్పటి నుంచి జిల్లాల్లో ఉండే డిస్పెన్సరీలోనే ముఖ గుర్తింపు, వేలిముద్ర (ఫేస్ అండ్ థంబ్ వెరిఫికేషన్) (Face and thumb verification)పరిశీలన ప్రక్రియ పూర్తి చేసుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ ఆర్ఎంలతో పాటు ఆయా డిపోల మేనేజర్లకు బస్భవన్ (Bus Bavan)నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
RTC Retired Employees | గతంలో హైదరాబాద్లోనే..
ఇప్పటివరకు ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు హైదరాబాద్లోని (Hyderabad) తార్నాక ఆర్టీసీ ఆస్పత్రి(Tarnaka RTC Hospital)లోనే ముఖ గుర్తింపు, వేలిముద్ర పరిశీలన సౌలభ్యం ఉండేది. దీంతో ఉమ్మడి జిల్లాలోని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు హైదరాబాద్కు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు వెళ్లే పరిస్థితి లేక ఆర్టీసీ డిస్పెన్సరీలో ఉచితంగా అందే వైద్యసేవలకు కూడా నోచుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల ఫోరం ప్రతినిధులు ఇటీవల రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లారు. దీంతో ఇటీవల డిస్పెన్సరీలోని ఫేస్ రికగ్నైజేషన్ కల్పిస్తున్నట్లు రాష్ట్రవ్యాప్తంగా ఆర్ఎంలకు ఉత్తర్వులు జారీ చేశారు.
RTC Retired Employees | వేల మందికి ఉపయోగం..
నిజామాబాద్ రీజియన్ పరిధిలో 2024 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మే వరకు రిటైర్డ్ అయిన వారు 135 ఉన్నారు. మొత్తానికి విశ్రాంత ఉద్యోగులు సుమారు 3వేలకు పైగా ఉంటారు. నిజామాబాద్ రీజియన్ పరిధిలో ఆర్మూర్, బోధన్, కామారెడ్డి(Kamareddy), బాన్సువాడ (Banswada), నిజామాబాద్ 1, 2 డిపోలు ఉన్నాయి. ఇకనుంచి ఆయా డిపోల పరిధి విశ్రాంత ఉద్యోగులంతా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వెనుక ఉన్న డిస్పెన్సరీలోనే ముఖగుర్తింపు, వేలిముద్ర పరిశీలన ద్వారా చికిత్సలు పొందే అవకాశం లభించింది.

త్వరలోనే ప్రారంభం..
– జ్యోత్స్న, నిజామాబాద్ రీజినల్ మేనేజర్
విశ్రాంత ఉద్యోగులకు డిస్పెన్సరీలోనే చికిత్స అందించేందుకు ముఖ గుర్తింపు, వేలిముద్ర పరిశీలన ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు అందాయి. పరికరాలు కూడా కొనుగోలు చేశాం. ఇకపై హైదరాబాద్కు వెళ్లకుండా ఇక్కడే చికిత్స పొందే అవకాశం ఉంది.