అక్షరటుడే, వెబ్డెస్క్: Registration Department | రాష్ట్ర ప్రభుత్వం (state government) ఒకవైపు ఆదాయాన్ని పెంచుకునే పనిలో పడింది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ తదితర శాఖల ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు మార్గాలను అన్వేషిస్తోంది.
ప్రత్యేకించి రిజిస్ట్రేషన్ల శాఖ (registration department) ద్వారా అధిక మొత్తంలో ఆదాయం సమకూరుతుంది. కానీ.. కొందరు అధికారుల తీరు వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. ప్రత్యేకించి దరఖాస్తుదారులు స్టాంప్ డ్యూటీ చెల్లించి మరీ స్లాట్ బుక్ చేసుకుని కార్యాలయానికి వెళ్లినా.. అధికారులు కావాలని రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయకుండా వెనక్కి పంపడంపై విమర్శలు వస్తున్నాయి.
Registration Department | తీరుపై విమర్శలు
నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం (Nizamabad Urban Sub-Registrar office) పరిధిలో ఇదివరకు రోజుకు 70 వరకు డాక్యుమెంట్లు జరిగేవి. ఆదాయం కూడా దండిగా వచ్చేది. కాగా.. రియల్ ఎస్టేట్ రంగం (real estate sector) డీలా పడడంతో గతేడాది నుంచి ఆ సంఖ్య దాదాపు సగానికి తగ్గింది. కొద్ది నెలల నుంచి రోజుకు 45 నుంచి 50 వరకు డాక్యుమెంట్లు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న సబ్ రిజిస్ట్రార్ సెలవు పెట్టి వెళ్లారు. దీంతో ఇన్ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
దరఖాస్తుదారులు సోమవారం పెద్దమొత్తంలో రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్స్ బుక్ చేసుకోగా.. దాదాపు అన్నింటిని కూడా అధికారులు తిప్పి పంపినట్లు సమాచారం. కేవలం మార్ట్గేజ్ దస్తావేజులు (mortgage documents) మాత్రమే పూర్తి చేసినట్లు తెలిసింది. కాగా.. రిజిస్ట్రేషన్ల కోసం దూర ప్రాంతాల నుంచి పలువురు అర్బన్ కార్యాలయానికి వచ్చారు. తాము దూరం నుంచి వచ్చామని, ప్రక్రియ పూర్తి చేయాలని కోరినప్పటికీ.. ఇన్ఛార్జి సబ్ రిజిస్ట్రార్ సీట్లో కూర్చున్న ఓ అధికారిణి పట్టించుకోకపోవడం గమనార్హం. పైగా.. ‘తాను కేవలం మార్ట్గేజ్ డాక్యుమెంట్లు మాత్రమే చేస్తానని.. రెగ్యులర్ రిజిస్ట్రేషన్లు (regular registrations) ఉంటే ఈ రోజు తన వద్దకు తేవద్దని సదరు అధికారిణి చెప్పడం’ కొసమెరుపు. ఒకవైపు ఆదాయం పెంచుకునేందుకు శాఖ ప్రయత్నిస్తుండగా.. మరోవైపు కిందిస్థాయి అధికారులు ఇలా వ్యవహరించడం గమనార్హం. దీనిపై ఉన్నతాధికారులు (higher officials) ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి.