అక్షరటుడే, వెబ్డెస్క్: Bengaluru | కర్ణాటక రాజధాని బెంగళూరు(Bengaluru) అతులాకుతలమైంది. ఆదివారం అర్ధరాత్రి తర్వాత కురిసిన భారీ వర్షం బెంగళూరు(Heavy rains in Bengaluru)లోని అనేక ప్రాంతాలలో విధ్వంసం సృష్టించింది. బెంగళూరు అర్బన్లో 132 మి.మీ వర్షపాతం నమోదు కాగా, నార్త్ అబ్జర్వేటరీ (సోమసెట్టహళ్లి)లో 119 మి.మీ వర్షపాతం నమోదైంది. హోరామావు ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సోమవారం ఉదయం నుంచి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రఖ్యాత నగరంలో పడవల ద్వారా బాధితులను రక్షించారు. తాజా దుస్థితి బెంగళూరు నగర వైఫల్యాలను మరోమారు చర్చనీయాంశం చేసింది. హోరామావులోని విద్యారణ్యపుర సాయి లేఅవుట్ వంటి ప్రాంతాలు భారీ వర్షాలతో అత్యంత ప్రభావితమయ్యాయి. అనేక ఇళ్లలోకి మోకాలి లోతు వరకు నీళ్లు చేరాయి. పరిస్థితిని అంచనా వేయడానికి, సహాయం అందించడానికి అధికారులు పడవలను ఉపయోగించాలని కోరారు. గతంలో స్థానికులు పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ, సరైన మురికినీటి కాలువలు, రోడ్డు సదుపాయాలు కల్పించాలని కోరుతూ నిరసనలు చేసినప్పటికీ స్పందన రాలేదు. ఫలితంగా మరోమారు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
Bengaluru | మునిగిన బెంగళూరు..
బెంగళూరులోని నడివీధులు చెరువుల్లా మారాయి. రోడ్లన్నీ నీట మునిగాయి. వాహనాలు తిరిగే రహదారుల్లో పడవల్లో తిరుగుతూ బాధితులను రక్షించారు. బెంగళూరు నగరమంతటా(Bengaluru city) ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. పణత్తూర్ ఆర్యూబీ, ఇతర లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. న్యూ బీఈఎల్ రోడ్, నాగవార, సిల్క్ బోర్డ్ వంటి కీలక రోడ్లు భారీ ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. ప్రధాన టెక్ పార్కులకు నిలయమైన ఔటర్ రింగ్ రోడ్ కారిడార్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. బెంగళూరులో అత్యంత అద్భుతమైన దృశ్యాలలో ఒకటిగా భావించే మాన్యత టెక్ పార్క్ చెరువును తలపించింది. అనేక ప్రాంతాల్లో రెండు అడుగుల కంటే ఎక్కువ నీరు నిలిచిపోయింది.
Bengaluru | సోషల్మీడియాలో సెటైర్లు..
జల విలయంపై బెంగళూరు వాసులు సోషల్ మీడియా(Social media)లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రభుత్వ(Karanataka government) మౌలిక సదుపాయాల వాగ్దానాలను మరిచిపోయిందని విమర్శించారు. ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బెంగళూరులో నీళ్లు నిలిచిపోవడంపై సెటర్లు వేశారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ దారుణంగా ట్రోల్ చేశారు. “బ్రాండ్ డీకే డైనమిక్ నాయకత్వంలో బెంగళూరులో ఓడరేవులు అభివృద్ధి చెందుతున్నాయి! త్వరలో వీటిని ప్రారంభిస్తారు. సొరంగం రోడ్లు, అండర్ వాటర్ మెట్రో, ఫెర్రీ రైడ్లు – అన్నీ వర్షం కారణంగానే.” అని ఓ నెటిజన్ ఎద్దేవా చేశాడు. బెంగళూరు నగర పాలక సంస్థ మీద నమ్మకం పోయింది. తక్షణ సాయం కూడా అందడంలేదని మరో నెటిజన్ వాపోయాడు.