అక్షరటుడే, వెబ్డెస్క్ : GST Collections | దేశంలో గత ఆర్థిక సంవత్సరం రికార్డు స్థాయిలో జీఎస్టీ (GST) వసూలైంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్టీ వసూళ్ల (GST Collections) వివరాలను కేంద్ర ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. ఏకంగా రూ.22.08 లక్షల కోట్లు జీఎస్టీ రూపంలో వసూలు కావడం గమనార్హం.
కేంద్రంలో మొదటి సారి అధికారంలోకి వచ్చిన సమయంలో బీజేపీ (BJP) దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం తీసుకు రావాలని నిర్ణయించింది. ఈ క్రమంలో 2017 జులై 1న గతంలో ఉన్న బహుళ పన్ను వ్యవస్థలో స్థానంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ(గూడ్స్ సర్వీస్ ట్యాక్స్) అందుబాటులోకి తెచ్చింది. అప్పటి నుంచి అన్ని రకాల వస్తువులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధిస్తుంది. అయితే పెట్రోల్, మద్యంను మాత్రం ఇందులో నుంచి మినహాయించారు. తొలి ఏడాది రూ.10.79 లక్షల కోట్ల జీఎస్టీ వచ్చింది.
GST Collections | ఐదేళ్లలో ఎంతో పురోగతి
2020–21 ఆర్థిక సంవత్సరంలో దేశంలో రూ.11.37 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు అయింది. 2024–25లో ఆ మొత్తం రూ.22.08 లక్షల కోట్లకు చేరుకోవడం గమనార్హం. అంటే ఐదు ఏళ్లలో జీఎస్టీ వసూళ్లు రెట్టింపు అయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 9.4 శాతం వృద్ధి నమోదు అయింది. కరోనా (Corona) సమయంలో తప్ప ప్రతి సారి జీఎస్టీ వసూళ్లు పెరుగుతూ పోవడం గమనార్హం. 2025 ఏప్రిల్లో రూ.2.37 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు అయింది. మే నెలలో రూ.2.01 లక్షల కోట్లు జీఎస్టీ రూపంలో వచ్చాయి.
GST Collections | జీఎస్టీ వసూళ్ల వివరాలు..
- 2017–18 : రూ.10.79 లక్షల కోట్లు
- 2018–19 : రూ.11.77 లక్షల కోట్లు
- 2019–20 : రూ.12.22 లక్షల కోట్లు
- 2020–21 : రూ.11.91 లక్షల కోట్లు
- 2021–22 : రూ.14.83 లక్షల కోట్లు
- 2022–23 : రూ.18.08 లక్షల కోట్లు
- 2023–24 : రూ.20.18 లక్షల కోట్లు
- 2024–25 : రూ.22.08 లక్షల కోట్లు
GST Collections | పెరిగిన పన్ను చెల్లింపుదారులు
దేశంలో జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత పన్ను చెల్లింపుదారుల (Tax Payers) సంఖ్య పెరిగింది. 2017లో పన్ను చెల్లింపుదారులు 65 లక్షల మంది ఉండగా 2025 నాటికి వారి సంఖ్య 1.51 కోట్లకు పెరిగింది.