అక్షరటుడే, వెబ్డెస్క్: Real Estate | కొన్నాళ్లుగా స్తబ్ధుగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ ఊపందుకుంటోంది. రాష్ట్రంలో భూముల క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రధానంగా స్థిరాస్తి రంగంలో కొనుగోళ్లు కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండున్నర నెలల్లో రాష్ట్రంలో స్థిరాస్తి లావాదేవీలతో రిజిస్ట్రేషన్ల శాఖ (registration department) ఆదాయం భారీగా పెరిగింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ప్రస్తుతం 17.72 శాతం వృద్ధి నమోదైంది. దీనితో ఈ రంగం పుంజుకుంటోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Real Estate | ఎన్నికల తర్వాత తగ్గిన భూమ్..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రియల్ ఎస్టేట్ రంగం (real estate sector) ఊహించని రీతిలో పురోగమించింది. భూముల రేట్లు ఆకాశాన్నంటాయి. హైదరాబాద్ (Hyderabad) సహా జిల్లా కేంద్రాలే కాదు, పల్లెల్లోనూ స్థిరాస్తి రంగం ఊపందుకుంది. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి రియల్ జోరుకు బ్రేక్ పడింది. కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చిన హైడ్రా (HYDRA) కారణంగా స్థిరాస్తి రంగం కొంత మందగించింది.
Real Estate | మారిన పరిస్థితులు
తెలంగాణలో (Telangana) ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇళ్ల స్థలాలు, అపార్ట్ మెంట్లు, ప్లాట్ల కొనుగోలు, విక్రయాలు పెరిగాయి. 2024లో ఏప్రిల్, మే, జూన్ (రెండు వారాలు) 3.24 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగితే, 2025లో అదే కాలంలో 3.37 లక్షల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. అంటే దాదాపు నాలుగు శాతం వృద్ధి కనిపించింది. 2024-25లో రెండు నెలల్లో మొత్తం ఆదాయం సుమారు రూ.2,565 కోట్లు కాగా, 2025-26లో అదే కాలంలో అది 3,020 కోట్ల రూపాయలకు చేరుకుంది. అంటే 450 కోట్లకు పైగా అదనపు ఆదాయం లభించింది. పెరుగుతున్న రియల్ భూమ్ కు ఇది నిదర్శనంగా నిలుస్తోంది.
Real Estate | ధరల సవరణ దిశగా..
భూముల మార్కెట్ విలువల ఆధారంగా ఆదాయాన్ని పెంచుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం (state government) కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం గత ఏడాది ప్రైవేట్ ఏజెన్సీతో (private agency) సర్వే కూడా చేయించింది. కానీ దేశవ్యాప్తంగా మార్కెట్ స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని తాత్కాలికంగా నిర్ణయం తీసుకోలేదు. హైదరాబాద్ (Hyderabad) పరిసర ప్రాంతాల్లో మార్కెట్ ధరలతో పోలిస్తే రిజిస్ట్రేషన్ విలువలు తక్కువగా ఉన్నాయి. దీని వల్ల ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతున్నట్టు అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ధరల సవరణపై మళ్లీ చర్చ మొదలైంది.