అక్షరటుడే, వెబ్డెస్క్: RBI | కేంద్ర ప్రభుత్వానికి భారత రిజర్వ్ బ్యాంక్(Reserve Bank of India) బంపర్ ఆఫర్ ఇచ్చింది. మార్చి 2025తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కేంద్రానికి చెల్లించాల్సిన భారీ డివిడెండ్ను శుక్రవారం ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను డివిడెండ్(Dividend)గా రూ.2.69 లక్షల కోట్లను చెల్లించాలని నిర్ణయించింది. ఇది 2023-24 లో చెల్లించిన దానికంటే 27.4 శాతం ఎక్కువ. ఆ సంవత్సరంలో ఆర్బీఐ కేంద్రానికి రూ.2.1 లక్షల కోట్లను చెల్లించింది. అంతకు ముందు సంవత్సరం అంటే 2022-23 సంవత్సరానికి రూ. 87,416 కోట్లు చెల్లించింది. ఆర్బీఐ(RBI) చెల్లిస్తున్న డివిడెండ్ ఏటేటా పెరుగుతుండడం విశేషం.
RBI | కేంద్రానికి భారీగా నిధులు..
రిజర్వ్బ్యాంక్ గవర్నర్(Reserve Bank Governor) సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన జరిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank of India) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 616 వ సమావేశంలో డివిడెండ్ చెల్లింపుపై తాజాగా నిర్ణయం తీసుకున్నారు. పెద్ద మొత్తంలో మిగులు నిధులను బదిలీ చేయాలని నిర్ణయించారు. దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, రిస్క్ ముప్పును సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ(RBI) తెలిపింది. ఏప్రిల్ 2024 – మార్చి 2025 కాలంలో రిజర్వ్ బ్యాంక్ పనితీరుపై కూడా బోర్డు చర్చించింది. 2024-25 సంవత్సరానికి రిజర్వ్ బ్యాంక్ వార్షిక నివేదిక మరియు ఆర్థిక నివేదికలను ఆమోదించింది. మే 15, 2025న జరిగిన సమావేశంలో కేంద్ర బోర్డు ఆమోదించిన సవరించిన ఆర్థిక మూలధన చట్రాన్ని (ECF) ఆధారంగా ఈ సంవత్సరానికి (2024-25) బదిలీ చేయగల మిగులును నిర్ణయించినట్లు కేంద్ర బ్యాంక్ తెలిపింది. “2024-25 అకౌంటింగ్ సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వానికి రూ. 2,68,590.07 కోట్ల మిగులును బదిలీ చేయడానికి బోర్డు ఆమోదం తెలిపింది” అని ఓ ప్రకటనలో వెల్లడించింది. కంటింజెంట్ రిస్క్ బఫర్ కింద రిస్క్ ప్రొవిజనింగ్ను ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్లో 7.50 నుండి 4.50 శాతం పరిధిలో నిర్వహించాలని సవరించిన ఫ్రేమ్వర్క్ నిర్దేశిస్తుంది.
RBI | డివిడెండ్ అంటే..
రిజర్వ్బ్యాంక్(Reserve Bank) ఏటా మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో చెల్లిస్తుంది. దేశ, విదేశీ సెక్యూరిటీలపై వడ్డీ, సేవలపై రుసుములు, కమీషన్లు, విదేశీ మారక ద్రవ్యం లావాదేవీలపై లాభం, అనుబంధ సంస్థల నుంచి ప్రతిఫలం రూపేణ ఆర్బీఐ(RBI)కి ఆదాయం వస్తుంది. కరెన్సీ నోట్ల ముద్రణ, డిపాజిట్లు, రుణాలపై వడ్డీ చెల్లింపులు, సిబ్బంది జీతభత్యాలు, కార్యాలయాల నిర్వహణ ఖర్చులు వంటి వ్యయాలు ఉంటాయి. ఈ ఆదాయ, వ్యయాల మధ్య తేడానే మిగులు నిధులుగా వ్యవహరిస్తారు. ఈ మిగులు నిధులను రిజర్వ్ బ్యాంక్ ఏటా కేంద్రానికి డివిడెండ్ల రూపంలో బదిలీ చేస్తుంది.