అక్షరటుడే, వెబ్డెస్క్ : Minister Post | రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఖాళీగా ఉన్న ఆరు పదవుల్లో నాలుగింటిని తాజాగా భర్తీ చేయాలని కాంగ్రెస్(congress) పార్టీ యోచిస్తోంది. ఈ క్రమంలో మంత్రి పదవి ఆశిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి (Komatireddy Rajagopal Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ(Nalgonda) జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు. వీరు ఇద్దరు నల్గొండ పార్లమెంట్ నియోజకర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు. రాజగోపాల్రెడ్డి మాట్లాడుతూ.. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని మునుగోడుకు కూడా ఒకసారి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని ఆయన అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం తనకు మంత్రి పదవి ఇవ్వాలన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ (nizamabad), ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఈ క్రమంలో ఉమ్మడి నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డికి మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఓసీల్లో ఒకరికి మాత్రమే పదవి ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై రాజగోపాల్రెడ్డి మాట్లాడుతూ.. తానూ సీనియర్ నాయకుడినే అని, సమర్థత ఆధారంగా మంత్రి పదవి తనకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అధిష్టానంపై నమ్మకం ఉందన్నారు. బీజేపీలో నుంచి కాంగ్రెస్లో చేరే సమయంలో, పార్లమెంట్ ఎన్నికల సమయంలో తన మంత్రి పదవి గురించి ఆలోచిస్తామని కాంగ్రెస్ పెద్దలు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.