అక్షరటుడే, వెబ్డెస్క్: AP BJP President | ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించి ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్(Former MLC PVN Madhav) పేరును అధ్యక్ష పదవికి పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం. నేడు జరిగిన నామినేషన్ ప్రక్రియలో ఆయన ఒక్కరే నామినేషన్ వేశారు. ఈ పదవి కోసం పీవీఎన్ మాధవ్తో పాటు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే సుజనా చౌదరి, రాజ్యసభ మాజీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, నరసింహారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి పలువురు ప్రముఖులు పోటీలో ఉన్నా.. హైకమాండ్ మాత్రం మాధవ్ వైపే మొగ్గు చూపిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. మాధవ్ నాయకత్వంలో పార్టీకి కొత్త జవసత్వాలు కలిగే అవకాశం ఉందని పార్టీ విశ్వసిస్తోంది.
AP BJP President | అతనే ఫైనల్..
రాష్ట్ర రాజకీయాల్లో కమ్మ, కాపు సామాజిక వర్గాలను కలుపుకుపోయే వ్యూహంపై బీజేపీ(BJP) దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఒకవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan)కి ప్రాధాన్యత ఇస్తూనే, మరోవైపు పార్టీలోనూ ప్రాంతీయ సామాజిక సమీకరణాలకు తగిన ప్రాధాన్యత ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇక ఇదిలా ఉంటే కన్నా లక్ష్మీ నారాయణ తర్వాత పురంధేశ్వరి(Purandheshwari) నాయకత్వంలో బీజేపీ-జనసేన కూటమికి మంచి ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. ఆమె అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో పార్టీ 3 లోక్సభ, 9 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది. ఇప్పటికే కేంద్రంలో మంత్రివర్గ విస్తరణపై చర్చలు సాగుతున్నాయి. ఈ క్రమంలో, రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరికి కేబినెట్ హోదా కలిగిన మంత్రి పదవి ఇవ్వనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
పీవీఎన్ మాధవ్ నేతృత్వంలో ఏపీ బీజేపీకి కొత్త ఉత్సాహం లభిస్తుందా? జనసేనతో కలిసి భవిష్యత్ ఎన్నికల్లో బలమైన ఫలితాలను సాధించగలదా? అనే అంశాలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాధవ్.. గతంలో శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్గా పనిచేసిని అనుభవం ఉంది. మరోవైపు ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్) బీజేవైఎం (భారతీయ జనతా యువ మోర్చా)లో కూడా అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అయితే పీవీఎన్ మాధవ్. బీజేపీకి చెందిన దివంగత బీజేపీ నేత చలపతిరావు కుమారుడు కాగా, చలపతిరావు రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా సేవలందించారు. ఇప్పుడు ఆయన రాజకీయ వారసత్వాన్ని మాధవ్ కొనసాగిస్తున్నట్టుగా అనుకోవాలి.