అక్షరటుడే, వెబ్డెస్క్:Nirjala Ekadashi | హిందూ ధర్మంలో నిర్జల ఏకాదశికి ఓ ప్రత్యేకత ఉంది. ఈరోజు ఎంతో నిష్టతో ఉపవాసాలు ఉండి విష్ణు సహస్ర నామ పారాయణం చేయడం ఎంతో పుణ్య ఫలాన్ని ఇస్తుందని వేద పండితులు చెబుతున్నారు.
క్యాలెండర్(Hindu calender) ప్రకారం ప్రతినెలా రెండు ఏకాదశి తిథులు వస్తాయి. శుక్ల పక్షంలో ఒకటి, కృష్ణ పక్షంలో మరొకటి.. అంటే ఏడాదికి 24 ఏకాదశి తిథులు వస్తాయన్న మాట. హిందువులు ఏకాదశి తిథి(Ekadashi Tithi)ని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఇందులోనూ జ్యేష్ట(Jyeshtha) మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి ప్రత్యేకత ఉంది. ఆ రోజు ఉపవాసం పాటిస్తే ఏడాదిలో వచ్చే అన్ని ఏకాదశి తిథులలో ఉపవాసం ఉన్న పుణ్య ఫలం లభిస్తుందని పేర్కొంటున్నారు ఆధ్యాత్మికవేత్త రుద్రమణి శివాచార్య.
ఇది నిర్జల ఏకాదశి(Nirjala Ekadashi) అని, అందువల్ల నీరు కూడా తాగకుండా నిష్టతో ఉపవాసం ఉండాలని సూచిస్తున్నారు. ఈనెల 6న(శుక్రవారం) నిర్జల ఏకాదశి. ఈ నేపథ్యంలో ఆ రోజున ఏం చేయాలో తెలుసుకుందాం.. నిర్జల ఏకాదశి ఉపవాసం అన్ని ఉపవాసాలలో పవిత్రమైనదిగా పరిగణింపబడుతోంది. నిర్జల ఏకాదశి నాడు సూర్యోదయం నుంచి మరుసటి రోజు ద్వాదశి సూర్యోదయం వరకు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. నీరు కూడా తాగకూడదు.
Nirjala Ekadashi | విష్ణుమూర్తి ఆరాధనతో..
విష్ణుమూర్తి(Lord Vishnu)ని పూజించాలి. విష్ణు సహస్ర నామ పారాయణం చేయాలి. “ఓం నమో భగవతే వాసుదేవాయ” అని జపిస్తూ రోజంతా ఆధ్యాత్మిక చింతనతో గడపాలి. శక్తి మేరకు దానధర్మాలు చేయాలి. ప్రధానంగా నీటిని దానం చేయాలి. ఇది ఎండాకాలంలో వస్తుంది కాబట్టి.. జల దానానికి ప్రాధాన్యత ఇచ్చారు. నీటి విలువను తెలిపేందుకే నిర్జల ఉపవాసం ఉండాలని పెద్దలు నిర్దేశించారు.
నిర్జల ఏకాదశి ప్రస్తావన మన పురాణాలలో ఉంది. ఈ తిథి రోజున ఆహారం, నీరు, నీటిని తీసుకువెళ్లడానికి ఉపయోగించే కమండలం, దుస్తులు, గొడుగులు దానం చేయాలని వేదవ్యాస మహర్షి భీముడికి సూచించినట్లు పద్మ పురాణం చెబుతోంది. అందుకే నిర్జల ఏకాదశిని భీమ ఏకాదశి(Bhima Ekadashi ) అని, పాండవ నిర్జల ఏకాదశి అని, పాపనాశిని ఏకాదశి అని కూడా పిలుస్తారు.