అక్షరటుడే, వెబ్డెస్క్ : PSLV-C61 | పీఎస్ఎల్వీ- సీ61 (PSLV-C61) రాకెట్ ప్రయోగానికి కౌంట్డౌన్ ప్రారంభమైంది. శనివారం ఉదయం 7.59 గంటలకు ప్రారంభమైన కౌంట్డౌన్ 22 గంటల పాటు కొనసాగనుంది. ఆదివారం ఉదయం ఉదయం 5.59 గంటలకు రాకెట్(Rocket) నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్ ద్వారా ఈవోఎస్–9 (EOS-9) ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. ఈ ఉపగ్రహాన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించడం గమనార్హం.
ఈ ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో ఛైర్మన్ నారాయణన్(ISRO Chairman Narayanan) శుక్రవారం తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం సూళ్లురుపేటలోని చెంగాలమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెలలో GSLV-F16 రాకెట్ ప్రయోగం చేపడుతామన్నారు. ఈ ఏడాది నెలకో ప్రయోగం చేపడుతామని ఆయన వివరించారు.
PSLV-C61 | దేశ భద్రత కోసం..
శ్రీహరి కోట(Srihari Kota)లోని షార్ నుంచి ఈ ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. దేశ భద్రత, రక్షణ వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనకు దోపదపడేలా ఉపగ్రహాన్ని రూపొందించారు. ఈ శాటిలైట్లో సీ-బ్యాడ్ సింథటిక్ అపార్చర్ రాడార్(Sea-Bed Synthetic Aperture Radar) అమర్చారు. దీంతో పగలు, రాత్రి సమయంలో వాతావరణ పరిస్థితులను తెలుసుకుంటారు. భూమి ఉపరితలంపై అధిక రిజల్యూషన్ కలిగిన ఫొటోలను సైతం దీంతో తీయవచ్చు. శత్రుదేశాల కదలికలు, ఉగ్రవాద శిబిరాలు వంటి వాటిని గుర్తించడానికి ఈ ప్రయోగం ఎంతగానో దోహదం చేయనుంది.
ఇటీవల ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన విషయం తెలిసిందే. భారత్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయగా.. పాకిస్తాన్ భారత సైనిక స్థావరాలపై దాడులకు యత్నించి విఫలైంది. అదే సమయంలో భారత్ పాక్లోని పలు ఎయిర్బేస్(Airbase)లను ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్ సమయంలో ఇస్రో కూడా కీలకంగా వ్యవహరించింది. ఉపగ్రహాల ద్వారా పాక్ కార్యకలాపాలను తెలుసుకొని ఆర్మీ(Indian Army)కి అందజేసింది. పది ఉపగ్రహాలు సరిహద్దు భద్రత కోసం 24 గంటలు పని చేస్తున్నట్లు ఇస్రో ఛైర్మన్ తెలిపారు.