అక్షరటుడే, ఆర్మూర్: Collector Nizamabad | ప్రభుత్వ పథకాల అమలు కోసం అధికారులు ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) అన్నారు. భీమ్గల్ మున్సిపాలిటీని (Bheemgal Municipality) ఆయన బుధవారం సందర్శించారు. పట్టణంలో అమలవుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, వన మహోత్సవం, సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం చేపడుతున్న చర్యలపై అధికారులతో సమీక్ష జరిపారు. ఒక్కోవార్డు వారీగా ఆయా అంశాల్లో ప్రగతిని సమీక్షించిన కలెక్టర్.. స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన కోసం ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Collector Nizamabad | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి
ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) నిర్మాణాలు వేగంగా జరిగేలా చొరవ చూపాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. లబ్ధిదారుల ఎంపిక, మంజూరు ప్రక్రియల్లో జాప్యానికి తావు లేకుండా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని.. పట్టణాల్లో కూడా పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
ఇళ్లు నిర్మించుకునే ఆర్థిక స్థోమత లేని లబ్దిదారులకు మెప్మా ఆధ్వర్యంలో బ్యాంకు లింకేజీ కింద రూ. లక్ష వరకు రుణం అందించేలా చొరవ చూపాలని చెప్పారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతి (Bhubarathi) రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేస్తున్న తీరును పరిశీలించారు. ఆగస్టు 14వ తేదీ లోపు అన్ని దరఖాస్తులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా మలేరియా నియంత్రణ విభాగం అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్, భీమ్గల్ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, తహశీల్దార్ షబ్బీర్ తదితరులున్నారు.