అక్షరటుడే, వెబ్డెస్క్: PM Modi | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) బుధవారం నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 26 వరకు ఆయన బ్రిటన్, మాల్దీవుల్లో పర్యటించనున్నారు. ఈ నెల 23, 24 తేదీల్లో ప్రధాని బ్రిటన్ను సందర్శిస్తారు. జులై 25, 26 తేదీల్లో మాల్దీవుల్లో పర్యటిస్తారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వాణిజ్యం, భద్రత, ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ప్రధాని పర్యటన సాగనుంది.
PM Modi | నాలుగోసారి..
బ్రిటన్ ప్రధాని ఆహ్వానం మేరకు నరేంద్ర మోదీ యూకే(UK)ను సందర్శించనున్నారు. ఆయన బ్రిటన్లో పర్యటించడం ఇది నాలుగో సారి కావడం గమనార్హం. రెండు దేశాల మధ్య వాణిజ్యం, సాంకేతికత, రక్షణ, భద్రత తదితర అంశాలపై ఇరు దేశాల అధినేతలు చర్చించనున్నారు. భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై కూడా చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
PM Modi | మాల్దీవులు స్వాతంత్య్ర వేడుకలకు..
ప్రధాని మోదీ మాల్దీవులు (Maldives) స్వాతంత్య్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో ఆయన ఆ దేశంలో పర్యటిస్తారు. గతంలో మాల్దీవులు అధ్యక్షుడిగా ముయిజ్జు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. ముయిజ్జు భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. దీంతో భారత పర్యాటకులు ఆ దేశానికి వెళ్లడం తగ్గించారు. ఈ క్రమంలో ముయిజ్జు ప్రధాని మోదీని ఆ దేశ స్వాతంత్య్ర వేడుకలకు ఆహ్వానించడం గమనార్హం. మోదీ మాల్దీవుల్లో పర్యటించడం ఇది మూడోసారి.