అక్షరటుడే, వెబ్డెస్క్: Kerala : పూజల పేరుతో మహిళను లైంగికంగా లోబర్చుకున్న ఘటన కేరళలో జరిగింది. బెంగళూరు(Bengaluru)కు చెందిన మహిళపై లైంగిక దాడికి పాల్పడడంతో కేరళ ఆలయ పూజారి సహాయకుడిని సోమవారం బెల్లందూర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు త్రిస్సూర్లోని శ్రీ విష్ణుమయ స్వామి ఆలయంలో పూజారి సహాయకుడిగా పనిచేసిన అరుణ్ గా గుర్తించారు. అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు(Bengaluru)కు చెందిన ఓ మహిళ(38) జీవన సమస్యలతో కొట్టుమిట్టాడుతూ కేరళలోని ఓ ఆలయంలో పూజలు చేయడానికి వెళ్లింది. అక్కడ పూజారి సహాయకుడు అరుణ్ ఆమెపై కన్నేశాడు. ఆమె కుటుంబంపై చేతబడి జరిగిందని, పూజలు చేస్తే సమస్యలు తొలగిపోతాయని నమ్మించాడు. పూజలు కఠినంగా ఉంటాయని ఆ మహిళను ఒప్పించాడు.
అనంతరం మహిళ ఒంటిపై నూలు పోగు లేకుండా చేసి పూజలో పాల్గొనేలా చేశాడు. విపరీత భయానికి గురైన ఆ మహిళ పూజలు అయిపోయాక ఇంటికి తిరిగి వెళ్లింది. ఇంటికి వెళ్లిన మహిళను అరుణ్ మళ్లీ రావాలని బలవంతం చేశాడు. మహిళ బట్టలు లేకుండా పూజలో పాల్గొన్న వీడియోలు, ఫొటోలు తన వద్ద ఉన్నాయని బెదిరించాడు.
బాధితురాలు కేరళ వెళ్లాక ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె వద్ద నుంచి డబ్బులు లాగేసుకుని, తాను ఎప్పుడు చెబితే అప్పుడు రావాలని బెదిరించాడు. దీంతో బాధితురాలు బెంగళూరుకు చేరుకున్నాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.