అక్షరటుడే, న్యూఢిల్లీ: CJI : భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా భూషణ్ రామకృష్ణ గవాయ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనను సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మే 14వ తేదీన జస్టిస్ గవాయి సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా న్యాయ మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేశారు. జస్టిస్ గవాయ్ ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీజేఐ ఖన్నా తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తి.
CJI : కీలక కేసుల్లో చారిత్రాత్మక తీర్పులు..
నవంబర్ 24, 1960న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించిన జస్టిస్ గవాయ్.. 1985లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1987లో బాంబే హైకోర్టులో స్వతంత్ర ప్రాక్టీస్ ప్రారంభించే ముందు మాజీ అడ్వకేట్ జనరల్, హైకోర్టు న్యాయమూర్తి దివంగత రాజా ఎస్ భోంస్లే వద్ద పనిచేశారు. సుప్రీంకోర్టులోని అనేక రాజ్యాంగ ధర్మాసనాలలో భాగంగా ఉన్న జస్టిస్ బీఆర్ గవాయ్ అనేక చారిత్రాత్మక తీర్పులు ఇచ్చారు. డిసెంబర్ 2023లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370లోని నిబంధనలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఏకగ్రీవంగా సమర్థించిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో ఆయన కూడా ఒకరు.
CJI : ఎన్నికల బాండ్లను రద్దులో భాగం..
రాజకీయ పార్టీల ఎన్నికల కోసం బాండ్లను తీసుకునే విధానాన్ని రద్దు చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్ బీఆర్ గవాయ్ కూడా ఒకరు. 4:1 మెజార్టీతో రాజకీయ పార్టీల నిధుల కోసం ఉద్దేశించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని కోర్టు రద్దు చేసింది. మరోవైపు, నోట్ల రద్దును సమర్థించిన ధర్మాసనంలో జస్టిస్ బీఆర్ గవాయ్ కూడా ఉన్నారు. రూ.1,000 , రూ.500 డినామినేటివ్ కరెన్సీ నోట్లను రద్దు చేయాలనే కేంద్రం నిర్ణయానికి ఆమోదం తెలిపిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో ఆయన కూడా భాగంగా ఉన్నారు.